
శ్రీరాముడి పాలనే స్ఫూర్తిగా భారత రాజ్యాంగ రచన జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరిపాలన, సంక్షేమం విషయంలో రామరాజ్యమే సరైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘మన్ కీ బాత్’ ఆదివారం ఎపిసోడ్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ, రాజ్యాంగంలోని పార్ట్ 3 ప్రారంభంలో సీతారామ లక్ష్మణుల చిత్రాలను పొందుపరచడాన్ని గుర్తు చేశారు. మూడో భాగంలో పౌరుల ప్రాథమిక హక్కులను వివరించిన విషయాన్ని ప్రస్తావించారు.
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం దేశవ్యాప్త పండుగలా జరిగిందన్న మోదీ, విదేశాల్లోనూ రామ నామ స్మరణ మార్మోగిందన్నారు. రామ జ్యోతి వెలిగించి దేశమంతా దీపావళి జరుపుకుందన్నారు.
అమృత్ కాల్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో మహిళలు తమ శక్తిని చాటారని కొనియాడిన ప్రధాని మోదీ, ఈ ఏడాది 13 మంది మహిళా అథ్లెట్లను అర్జున అవార్డుతో కేంద్రప్రభుత్వం సత్కరించిందన్నారు. పద్మ అవార్డులను ప్రజల అవార్డులుగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.





