
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో మంగళవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తుండగా ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు. ఉదయం నుంచే ఏర్పాట్లు చేయగా, మధ్యాహ్నం కార్యక్రమం ప్రారంభించే సమయానికి ఏబీవీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వేదికపైకి వచ్చి నిర్వాహకులను ప్రశ్నించడంతో వారు వేడుకలు ఆపేశారు.
ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని మతపరమైన ప్రార్థనాలయాలుగా మారుస్తున్నారని ఆగ్రహించారు. ‘వీఎస్యూలో ఇలాంటి కార్యక్రమాలను ఉపకులపతి ఎందుకు పట్టించుకోవడం లేదు? అన్ని మతాల విద్యార్థులున్న విద్యాసంస్థలో క్రిస్మస్ వేడుకలు ఎలా నిర్వహిస్తారు? సంక్రాంతి, దసరా, రంజాన్ పండుగలు ఎందుకు జరపలేదు’ అని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను పక్కనపెట్టి మతపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. ఒక మతానికి పరిమితమైన వీసీని వెంటనే తొలగించి, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్సిటీ ప్రాంగణంలోని వీసీ భవనానికి శిలువ ఏర్పాటు చేయడాన్ని ఖండించారు.





