
స్వలింగ పెళ్లి చేసుకున్నవారికి మౌలిక సాంఘిక హక్కులను కల్పించడానికి ప్రభుత్వం ఓ మార్గాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. ఉమ్మడి బ్యాంకు ఖాతాలను తెరవడం, బీమా పాలసీల్లో ఇటువంటి జంటలో ఒకరిని నామినేట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం పార్లమెంటుకుగల విశిష్ట అధికారమని సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించినట్లు కనిపిస్తోంది.
స్వలింగ వివాహాలకు గుర్తింపు, రక్షణ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ గురువారం కొనసాగింది. పెళ్లి చేసుకునే హక్కును తమకు నిరాకరించడమంటే తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు. తమ ప్రాథమిక హక్కులను నిరాకరించడం వల్ల తాము వివక్షకు, బహిష్కరణకు గురవుతున్నామన్నారు.
సుప్రీంకోర్టు స్పందిస్తూ, దీనిపై ప్రతిస్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. స్వలింగ వివాహం చేసుకున్న జంటలకు వైవాహిక హోదాను ఇవ్వకుండానే ఈ అంశాల్లో కొన్నిటిని పరిష్కరించడమెలాగో చూడాలని సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది. స్పందనను బుధవారంనాటికి సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 3న జరుగుతుంది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ, ఇది శాసన వ్యవస్థకు సంబంధించిన అంశమని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. కలిసి జీవించే సంబంధాలను నెరపుతున్నవారి విషయంలో ఏం చేయాలనుకుంటున్నదీ ప్రభుత్వం చెప్పాలన్నారు. భద్రత ఉన్నదనే భావం ఎలా కలుగుతుంది? సాంఘిక సంక్షేమం ఉన్నదనే భావం ఎలా కలుగుతుంది? ఇటువంటి సంబంధాలు సమాజం నుంచి బహిష్కరణకు గురికాకుండా ఉండేలా చూడటం ఎలా? అనే అంశాలను ప్రభుత్వం చెప్పాలన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం మాట్లాడుతూ, స్వలింగ వివాహాలపై చర్చించవలసినది న్యాయస్థానం కాదని, పార్లమెంటేనని చెప్పారు. అయితే ఇది ప్రభుత్వం వర్సెస్ న్యాయ వ్యవస్థ సమస్యగా చేయాలని తాను కోరుకోవడం లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ను వ్యతిరేకించింది. స్వలింగ వివాహాలను భారత దేశ సంప్రదాయ కుటుంబాలతో పోల్చకూడదని తెలిపింది. భారత దేశ సంప్రదాయ కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు ఉంటారని తెలిపింది.





