News

హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి

4views

అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత సైన్యానికి చెందిన ‘చీతా’ అనే హెలికాప్టర్‌ కుప్పకూలిపోయి.. తెలంగాణకు చెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ వీవీబీ రెడ్డి(37)తోపాటు మరో మేజర్‌ జయంత్‌ మృతిచెందారు. కమెంగ్‌ జిల్లాలోని బంగ్లాజాగ్‌లో గురువారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఇద్దరు పైలట్లు విధి నిర్వహణలో భాగంగా హెలికాప్టర్‌లో అసోంకు వెళ్తుండగా.. టేకాఫ్‌ అయిన 15 నిమిషాలకే హెలికాప్టర్‌కు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోవడంతో ప్రమాదం సంభవించింది. దీంతో హైదరాబాద్‌ మల్కాజిగిరికి చెందిన ఆర్మీ లెప్టినెంట్‌ కల్నల్‌ ఉప్పల వినయ భానురెడ్డి దుర్మరణం చెందారు. ఆయనకు భార్య స్పందనారెడ్డి, కుమార్తెలు అనికరెడ్డి(6), హర్వికరెడ్డి(4) ఉన్నారు. స్పందనారెడ్డి కూడా పుణెలో ఆర్మీలో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. వారి స్వస్థలం యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం కాగా వీవీబీరెడ్డి తండ్రి నర్సింహ్మారెడ్డి గత 40 సంవత్సరాల క్రితం మల్కాజిగిరిలోని దుర్గానగర్‌లో నివాసముంటున్నారు. 2007లో ఆర్మీలో ఉద్యోగం సాధించిన వీవీబీ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి లెప్టినెంట్‌ కల్నల్‌ స్థాయికి చేరారు. పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్‌లో శుక్రవారం వీవీబీరెడ్డి మృతదేహం నగరానికి రానుంది.