News

భారత సంతతి ప్రొఫెసర్‌పై అమెరికాలో జాతి వివక్ష!

326views

అమెరికాలో భారత సంతతికి చెందిన లక్ష్మీ బాలచంద్ర అనే అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మసాచుసెట్స్‌లో తాను పని చేస్తున్న బాబ్సన్‌ కాలేజీపై జాతి, లింగ వివక్ష ఆరోపణలు చేశారు. వీటి కారణంగా కెరీర్‌ అవకాశాలను కోల్పోయానంటూ కాలేజీపై కేసు కూడా పెట్టారు. అంతేగాక ఆర్థిక నష్టానికి, మానసిక కుంగుబాటుకు లోనయ్యానంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కాలేజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ డివిజన్‌కు సారథ్యం వహించిన ప్రొఫెసర్‌ ఆండ్రూ కార్బెట్‌ ఇందుకు ప్రధాన బాద్యుడు.

దీన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా విచారించి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. బాబ్సన్‌ కాలేజీ శ్వేత జాతీయులకు, అందులోనూ పురుషులకు మాత్రమే పెద్దపీట వేస్తుంది. వారికే ప్రివిలేజీలన్నీ కల్పిస్తుంది’’ అని ఆరోపించారు. ఆమె 2012 నుంచి కాలేజీలో పని చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలను తాము చాలా సీరియస్‌గా తీసుకుంటామని కాలేజీ ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిపై విచారణ జరిపి తప్పిదాలను సరిదిద్దేందుకు పకడ్బందీ వ్యవస్థ అమల్లో ఉందని చెప్పుకొచ్చింది.