News

కోహినూర్ వినియోగంపై బ్రిటన్‌ ప్రభుత్వం పునరాలోచన.. ఎందుకంటే?

239views

బ్రిటన్ రాజుగా చార్ల్స్ పట్టాభిషేకం కొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో క్వీన్ కాన్సార్ట్ అయిన కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగించాలని తొలుత భావించారు. అలా చేస్తే బ్రిటన్ వలస పాలన నాటి చేదు అనుభవాలను భారత్ ప్రజలకి గుర్తు చేసినట్టవుతుందని భావించి కోహినూర్ వజ్రం గురించిన ఆలోచనను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అంతేగాక బ్రిటన్ పాలించిన దేశాల నుంచి తెచ్చిన మరిన్ని వజ్రాలు, బంగారు వస్తువులు, ఇతర విలువైన సంపదని ఆ దేశాలకి తిరిగివ్వాలనే డిమాండ్లు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యంగా గతేడాది రాణి మరణం తర్వాత ఈ డిమాండ్లు బాగా ఊపందుకున్నాయి. ఆ సంపదను వాటి స్వంత దేశాలకు తిరిగి ఇచ్చేస్తే తమ దేశంలో మ్యూజియంలు అన్నీ ఖాళీ అయిపోతాయని గతంలో బ్రిటన్ మంత్రి ఒకరు కామెంట్ చేశారు. ఈ పట్టాభిషేకం నేపథ్యంలో కోహినూర్ వజ్రం గురించి, బ్రిటన్ దగ్గరున్న ఇతర దేశాల సంపద గురించి తెలుసుకుందాం…

కోహినూర్ రావాలని..
కోహినూర్‌ (Kohinoor) వజ్రం.. ఈ పేరు వినగానే భారతీయుల హృదయం ఉప్పొంగుతుంది.. ఎప్పటికైనా బ్రిటన్ నుంచి ఆ విలువైన వజ్రం భారత్‌కు తిరిగి రావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. ఆ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ (Britain) మహారాణి అధికారిక నివాసం టవర్‌ ఆఫ్‌ లండన్‌ (Tower of London)లో ఉంది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని పాలించిన అధినేతలు తమ వలస దేశాలకు చెందిన ఎంతో విలువైన సంపదను దోచుకున్నారు. కోహ్ ఈ నూర్ (పర్షియాలో వెలుగుల కొండ అని అర్థం)తో పాటు భారత్ నుంచే ఎంతో విలువైన సంపదను బ్రిటీషర్లు తమ దేశానికి తరలించారు. అలాగే కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి కూడా విలువైన వజ్రాలను సేకరించారు. వాటి విలువ ఇప్పటి లెక్కల ప్రకారం కొన్ని లక్షల ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్‌ను హత్య చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ రాజ్యంలో విలువైన సంపదను తమ దేశానికి తరలించింది. సుల్తాన్‌కు చెందిన రత్న మణియమైన ఖడ్గం, సింహాసనం, పచ్చలు, కెంపులు, వజ్రాలు పొదిగిన బంగారు పులి తల మొదలైన వాటిని తమ దేశానికి తరలించుకుపోయి వాటిని వేలం వేసి అప్పట్లోనే కోట్లు గడించారు. టిప్పు సుల్తాన్‌కు చెందిన కొన్ని విలువైన వస్తువులు ఇప్పటికీ బ్రిటన్ మ్యూజియమ్‌ల్లో ఉన్నాయి.

షాజహాన్ పాత్ర, ఝాన్సీ రాణీ నగలు అక్కడే..
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తరచుగా మద్యం సేవించే అత్యంత విలువైన మధు పాత్రను కూడా ఈస్టిండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. అత్యంత అరుదైన వజ్రపు రాయితో పక్షి ఆకారంలో ఉండే ఆ మధు పాత్ర షాజహాన్‌కు ఎంతో ప్రీతిపాత్రమైంది. ఇక, పంజాబ్ చక్రవర్తి ఎంతో ఇష్టపడి, ఎంతో ధనం వెచ్చించి చేయించుకున్న సింహాసనం, ఝాన్సీ రాణి విలువైన ఆభరణాలు కూడా బ్రిటీషర్ల పాలయ్యాయి. ఝాన్సీ రాణిని దొంగ దెబ్బ తీసి చంపేశాక ఆమె అంత:పురంలోని ఖరీదైన వజ్రాలు, నగలు, నాణేలతో పాటు ఆమె మంచాలు, పరుపులు కూడా ఎత్తుకెళ్లిపోయారు.