News

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేతికి తుపాకీ.. పోలీసులు ఎందుకిచ్చారంటే?

284views

మహమ్మద్ ప్రవక్త (Prophet Muhammad)పై వ్యాఖ్యలు చేసిన బీజేపీ (BJP) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు ఢిల్లీ పోలీసుల వ్యక్తిగత తుపాకీ లైసెన్సును మంజూరు చేశారు. ఆమె గత ఏడాది ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆమె మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేగింది. దీంతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది. అనంతరం ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను గాయపరచేందుకు కాదని, శివలింగాన్ని ఎగతాళి చేస్తూ ఓ ప్యానెలిస్ట్ మాట్లాడటంతో తాను తిప్పికొట్టడం కోసమే ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె గతంలో వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ ముస్లింలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గత ఏడాది జులైలో సుప్రీంకోర్టు ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశాన్ని తగులబెట్టారని దుయ్యబట్టింది. దేశంలో జరుగుతున్నదానికి ఆమె మాత్రమే బాధ్యురాలని స్పష్టం చేసింది. కానీ ఆమెపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులన్నిటినీ ఢిల్లీలోనే విచారణ జరిగేలా గత ఏడాది ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆమెను హత్య చేస్తామంటూ పలువురు హెచ్చరించారు.

తుపాకీ ఎందుకిచ్చారంటే..
మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నాటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని.. ఈక్రమంలో తన భద్రతకు ముప్పు ఉన్నందువల్ల వ్యక్తిగతంగా తనతోపాటు ఓ తుపాకీని తీసుకెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పోలీసులు.. ఆమెకు గన్ లైసెన్స్‌ను మంజూరు చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు ధ్రువీకరించారు. వ్యక్తిగతంగా తుపాకీని తీసుకెళ్లేందుకు ఆమెకు అనుమతి ఇచ్చారు.