
150views
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబుతున్న ప్రస్తుత తరుణంలో రాబోయే 25 సంవత్సరాలకు దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే విధంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ నెల నాలుగోతేదీ నుంచి జూలై తొమ్మిదోతేదీ వరకు జోనల్, సబ్-జోనల్ స్థాయిలో సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఈ నెల తొమ్మిదిన విశాఖపట్నంలో “ఆశావాహ జిల్లాలపై జోనల్ సమావేశం” జరగనుంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ అధ్యక్షత వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధికారులు, ప్రతినిధులు పాల్గొననున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పరా మహేంద్రభాయ్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.