పాక్ దిగొచ్చింది: మసూద్ అజర్ సోదరుడు, బావమరిదిని అరెస్టు చేసిన పాకిస్తాన్. భారత్ కు భయపడి తీసుకుంటున్న చర్యలా?

ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రావుఫ్ అస్గర్ను పాకిస్తాన్ అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈయనతో పాటు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న 44 మందిని కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించింది. అబ్దుల్ రావుఫ్ అస్గర్తో పాటు మసూద్ అజర్ బావమరిది హమ్మద్ అజర్ను కూడా అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ వెల్లడించింది. ఇద్దరూ సురక్షితంగానే ఉన్నట్లు పాకిస్తాన్ తెలిపింది. ఓ మీడియా సమావేశంలో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి షహర్యార్ ఆఫ్రిది వెల్లడించారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటామని ప్రపంచ దేశాలకు మాట ఇచ్చిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ ఎవరు..?
ముఫ్తీ అబ్దుల రౌఫ్…ఇతను జైషే మహ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజర్కు చిన్న తమ్ముడు. జైషే మహ్మద్ కార్యకలాపాలకు ప్రస్తుతం ఇతనే నాయకత్వం వహిస్తున్నాడు. భారత్లో జరిగిన పలు దాడులకు వ్యూహకర్త ముఫ్తీ అబ్దుల్ రౌఫ్. ఇందులో 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్, 2001లో పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై దాడి, ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడుల్లో ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ హస్తం ఉంది. ఇప్పటికే ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా రౌఫ్ పేరును జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏ చార్జ్షీట్లో చేర్చింది. మసూద్ అజర్తో పాటు బహవల్ పూర్లో ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ నివసిస్తున్నట్లు సమాచారం.
ఆరోపణలు రుజువు చేయకుంటే విడుదల చేస్తాం
అరెస్టు అయిన వారి పేర్లను భారత ప్రభుత్వం పాకిస్తాన్కు ఇచ్చిన ఉగ్రవాదులు జాబితాలో ఉన్నాయని పేర్కొంది. అయితే అరెస్టు అయిన వారిపై సాక్ష్యాధారాలు నివేదించకపోతే వారిని విడుదల చేస్తామని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. అరెస్టు అయిన ఉగ్రవాదులను తమ అధీనంలో రెండు వారాల పాటు ఉంచుకుంటామని ఆలోగ వారిపై మోపబడ్డ ఆరోపణలు రుజువు చేయాలని పాక్ మంత్రి షహర్యార్ ఆఫ్రిది వెల్లడించారు.

భారత్ ఒత్తిడితో అరెస్టులు చేయలేదు
భారత్ నుంచి వచ్చిన ఒత్తిడితో హమ్మద్ అజర్, అబ్దుల్ రౌఫ్ అజర్లను అరెస్టు చేయలేదని నేషనల్ యాక్షన్ ప్లాన్ కమిటీ నిర్ణయం మేరకు అరెస్టు చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని సంస్థలపై చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. పాక్ గడ్డపై కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటామని అంతకుముందు పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి వెల్లడించారు. ఈ నిర్ణయం పుల్వామా దాడులు జరగకముందే ఓ సమావేశం సందర్భంగా తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. వివిధ ఉగ్రవాద సంస్థలపై ఎలా వ్యవహరించాలో తమ వద్ద పలు రకాల వ్యూహాలు ఉన్నాయని చెప్పారు.
Source: One India





