ArticlesNews

పలనాటి పులి కన్నెగంటి

679views

ఎంతో మంది విప్లవకారులను స్వాతంత్య్రోద్యమంలో వెన్నుతట్టి నడిపిన స్ఫూర్తి కన్నెగంటి హనుమంతు. శరీరంలోకి 24 గుండ్లు దూసుకెళ్లిన తరువాత కూడా సుమారు కొన్ని గంటలపాటు మాతృమూర్తి దాస్య శృంఖలాలను తెంచడానికి బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ధీరుడు కన్నెగంటి హనుమంతు. పుల్లరి చెల్లింపును ధిక్కరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన నాయకుడు.

కన్నెగంటి హనుమంతుకి జన్మనిచ్చింది మించాలపాడు అనే ఓ కుగ్రామం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గికి సమీపంలోని కోలెకుట్ట శివారు ప్రాంతమే మించాలపాడు. 1870వ సంవత్సరంలో ఓ సామాన్య కుటుంబములో వెంకటయ్య, అచ్చమ్మ దంపతులకు ద్వితీయ సంతానముగా జన్మించాడు హనుమంతు.

అది 1920వ సంవత్సరం. దేశమంతా గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొంటోంది. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోని నాయకుల పిలుపునందుకొని ఆంధ్రదేశం కూడా సహాయ నిరాకరణోద్యమంలోకి దూకింది. సహాయ నిరాకరణోద్యమంలో పన్నుల నిరాకరణ ఓ భాగం. గుంటూరు జిల్లాలో ఉన్నవ లక్ష్మీనారాయణగారు దీనికి నాయకులు.

పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వెల్దుర్తి, జట్టిపాలెం, రెంటచింతల వంటి ప్రాంతాల్లో ప్రజాజీవనం ఆ ప్రాంతపు అడవులతో ముడిపడి ఉంది. 1921 సంవత్సరం ప్రాంతంలో పల్నాడులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పరాయి పాలనలో సామాన్య ప్రజలకు కూడు, గుడ్డ వంటి కనీసావసరాల మాట దేవుడెరుగు కనీసం పశువులకు గ్రాసం, గ్రామ జీవితంలో భాగమైన కట్టెలు కొట్టుకోవడం, ఆకూ అలమూ పోగుచేసుకోవడం వంటి వాటికి సైతం బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలు విధించింది.

అడవిలో పశువుల్ని మేపుకోవడానికీ, కట్టెలు కొట్టుకోవడానికీ ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి పుల్లరి చెల్లించాలనే నిబంధన విధించింది. దరిమిలా ప్రభుత్వాధికారులు మేతకు వచ్చిన పశువుల్ని బందెలదొడ్డికి తోలడం, ప్రజలు వాటిని విడిపించుకోవడానికి నానా అవస్థలూ పడటం పరిపాటయిపోయింది. ఈ క్రమంలో ప్రజలను సంఘటిత పరచి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నాయకత్వం వహించాడు కన్నెగంటి హనుమంతు. ప్రభుత్వానికి ప్రజలు పుల్లరి చెల్లించరాదనే ఉద్యమాన్ని లేవదీశాడు.

“ఈ చెట్టు నువ్వు పెట్టావా? విత్తు నువ్వు పెట్టావా? నారు నువ్వు పోశావా? నీరు నువ్వు పెట్టావా? మా జీవగడ్డపై నీకెక్కడి నుంచి వచ్చింది పెత్తనం?” అనే పిడుగుల్లాంటి ప్రశ్నలతో కన్నెగంటి గర్జించాడు. బ్రిటిష్ నిరంకుశ పాలనలో భారతీయులు అనుభవిస్తున్న అవస్థలను, అవమానాలను చూసి రగిలిపోయిన కన్నెగంటి హనుమంతు పోరుబాట పట్టాడు. అనేక మంది యువకులను కలుపుకొని ఒక దండుగా కదిలాడు. తెల్లవారిపై దండయాత్ర చేశాడు. ఉడుకు రక్తం కలిగిన యువకులెందరో ఆయన వెంట నడిచారు. పెద్దతరం నిండు మనసుతో కన్నెగంటి నాయకత్వాన్ని అంగీకరించి, ఆశీర్వదించారు. మహిళలు, వృద్ధులు నైతిక మద్దతు ఇచ్చారు. పలనాడు సీమలో కన్నెగంటి ప్రతాపం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. తెల్ల వారి సైన్యం తెల్ల మొఖం వేసింది. కన్నెగంటి సాహసం, నిబద్దత ముందు వారి కుయుక్తులు తుత్తునియలయ్యాయి. అయితే… బ్రిటిష్ జనరల్ టి. జి. రూథర్ ఫర్డ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెర్నర్ కొంత మంది స్థానిక వంచకులను చేరదీశాడు. ఎప్పటికప్పుడు కన్నెగంటి కదలికలు తెలుసుకొని ఆయనను మట్టు బెట్టాలని ప్రయత్నాలు చేశాడు. తమ వీరబిడ్డడు కన్నెగంటిని ప్రజలే కంటికి రెప్పలా కాపాడుకున్నారు.

దాంతో బ్రిటిష్ జనరల్ టి. జి. రూథర్ ఫర్డ్ మరో కుట్ర పన్నాడు. కన్నెగంటిని ప్రలోభాలతో లొంగదీయాలని తలపోశాడు. దుర్గి ఫిర్కకు కన్నెగంటిని జమిందార్ గా చేస్తామంటూ కరణం ద్వారా వర్తమానం పంపాడు. ఇష్టం వచ్చినంత శిస్తు వసూలు చేసుకోవచ్చని ఆశ పెట్టారు. కానీ నిష్కళంక దేశభక్తుడైన కన్నెగంటి తాను తార్పుడు గాడిని కాననీ, తోటి భారతీయులను వంచించి నెత్తుటి కూడు తినననీ తెగేసి చెప్పాడు. 1922 ఫిబ్రవరి 26 ఉదయం కొందరు అటవీ, రెవిన్యూ శాఖలకు చెందిన అధికారులు మించాలపాడు గ్రామానికి వచ్చి హనుమంతును కలిసి పుల్లరి కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఆప్పటికే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని విరమిస్తూ నిర్ణయం తీసుకొనివున్నారు కనుక పుల్లరి చెల్లించడానికి తనకు అభ్యంతరం లేదని కన్నెగంటి చెప్పారు. గ్రామస్తులందరి పుల్లరి కట్టడానికి తాను సిద్దంగా ఉన్నానని వారికి చెప్పి పంపారు. అదే రోజు మధ్యాహ్నం మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని ముటుకూరు లింగం కోటయ్య అధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభ కోటప్పకొండకు బయలుదేరింది. మించాలపాడుతో సహా చుట్టు పక్కల గ్రామాలలోని యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కన్నెగంటి అనుచరులు, అభిమానులు కాంగ్రెస్ ప్రభతో కలసి వెళ్ళారు.

గ్రామాల్లో మహిళలు, వృద్దులు మాత్రమే ఉన్నారు. అదే అదనుగా భావించిన బ్రిటిష్ సేనలు గ్రామాన్ని దిగ్బంధం చేశాయి. పశువులను మందగా చేసి తోలుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అడ్డువచ్చిన వారిని తుపాకి మడమలతో కొట్టి హింసించారు. విషయం తెలుసుకొని, అధికారులతో మాట్లాడి పుల్లరి చెల్లించి రావడానికి కన్నెగంటి ఆ దిశగా బయలుదేరారు. “ఆగండి. ఎవరినీ హింసించకండి. పుల్లరి చెల్లించడానికి మేము సిద్దం” అని ఆయన సైగలు చేస్తున్నా…. వారు లక్ష్య పెట్టలేదు. కన్నెగంటి అతనే అని కరణం చుపించగానే ఎటువంటి మాటామంతీ లేకుండా, ముందస్తు హెచ్చరిక లేకుండా కన్నెగంటిని బ్రిటిష్ సేనలు చుట్టుముట్టాయి. శిస్తు కట్టడానికి మేము సిద్దం అని చెబుతున్నా వినకుండా కన్నెగంటిపై కాల్పులు జరిపారు. 26 తూటాలు కన్నెగంటి శరీరంలోకి దూసుకుపోయాయి. ఆయన తోపాటే వున్న ఇంటి పాలేరు ఎల్లంపల్లి శేషయ్యను కూడా పాశవికంగా కాల్చి చంపారు. రక్తం మడుగులో పడి ఉన్న కన్నెగంటి చుట్టూ బ్రిటిష్ సేనలు వలయంలా నిలబడి గ్రామస్తులను దరిచేరనివ్వలేదు. కన్నెగంటి హాహాకారాలు చేస్తున్నా ఆసుపత్రికి తరలించనివ్వలేదు. దాహం… దాహం… అని అరుస్తున్నా మంచి నీరు ఇవ్వలేదు. తమ ప్రియతమ నాయకుడికి గ్రామస్థులు మంచి నీరు ఇవ్వబోగా బ్రిటిష్ తొత్తులు అడ్డుకున్నారు. హనుమంతు భార్య గంగమ్మ తెచ్చిన నీటిని కూడా నేలపాల్జేశారు. ఈ దాష్టీకం సహించలేని గ్రామస్థులు కారం, బరిశలు, విల్లంబులతో తిరగబడ్డారు. కానీ సర్కారు సేనల పశు బలం ముందు నిలవలేకపోయారు. బ్రిటిష్ సేనలు ఆ రాత్రంతా గ్రామం పైబడి దోచుకున్నారు.

సాయంకాలం 6 గంటలకు తుపాకి తూటాలకు గాయపడిన పల్నాడు సింహం కన్నెగంటి అర్థరాత్రి వరకూ శక్తి కూడదీసుకొని ‘వందేమాతరం’ ‘వందేమాతరం’ అని నినాదాలు చేస్తూనే ఉన్నాడు. అర్థరాత్రి దాటాక ఆ పల్నాటి వీరబిడ్డడు అమరుడయ్యాడు. ఆ మర్నాడు కోలగుంట్లలో హనుమంతు, మరో ఇద్దరి భౌతిక కాయాలను బ్రిటిష్ సేనలు పూడ్చి పెట్టి వెళ్ళాయి.

పల్నాటి సీమలోని ప్రతి ఒక్కరూ కన్నెగంటి మరణానికి కన్నీరు కార్చారు. స్మరణ మాత్రంచేత మనందరిలో దేశభక్తిని, పౌరుష పరాక్రమాలను మేల్కొల్పగల వేలాది ధీరోదాత్త, త్యాగశీల, మహోన్నత భారతి ప్రియసుతులలో కన్నెగంటి హనుమంతు ముందువరుసలో ఉంటారు.
అలాంటి ధీర హృదయుడు కన్నెగంటిని గూర్చి కొందరు ప్రఖ్యాత వ్యక్తులేమన్నారో ఒకసారి చూద్దాం….

“కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకు, కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు.
ఎలుగెత్తెను ఆ కంఠo మనదే రాజ్యం …జపియించెను ఆ వదనం వందే మాతరం.”

అన్నారు అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం వ్రాసిన ఓ గీతంలో ఆరుద్ర.

మిణుగురులు లేచె బెడదవు
శౌర్యాగ్నిశిఖలు మాంచాలపురిన్
హనుమంతుడన వీరుడు
తెల్ల దొరలనెదిరించెన్.

కన్నెగంటి హనుమంతు పోరాటంలో ఆయనకు చేయుతగా నిలచిన మించాలపాడు గ్రామ ప్రజలందరూ విప్లవ వీరులై విజృంభించారని, గ్రామంలో విప్లవ జ్వాలా శిఖలు ఎగసినాయని, చీకటిలో పయనించే బాటసారుల వంటి భారతీయులకు ఆ గ్రామస్తులు వెలుగు చూపే మిణుగురుల వంటివారని కవికోకిల గుఱ్ఱం జాషువా గారి అభిప్రాయం.

కన్నెగంటి హనుమంతు కోర మీసము దువ్వి
పలనాటి ప్రజలచే పన్నులెగగొట్టించె
బలి ఇచ్చె హనుమంతునూ
పలనాడు! పర ప్రభుత్వము గుండ్లకు !

వీరోచితంగా పోరాడి పన్నులు ఎగగొట్టించిన తమ వీర బిడ్డడు హనుమంతును పరాయి పాలకుల తూటాలకు బలి ఇచ్చింది పలనాడు సీమ. శ్రీనాథుడు, చంద్రవంక నదికి వివరించి చెప్పిన వీర, శృంగార, కరుణ రసప్రధానమైన గాథలలో ఒకటిగా కన్నెగంటి హనుమంతు గాథ చేర్చదగినదని శ్రీ పులుపుల శివయ్య అభిప్రాయం.

ఆంగ్లేయుల తుపాకీ గుళ్ళకు బలియై భౌతికంగా మనకు దూరమైనా, మనందరి హృదయాలలో ఎప్పటికీ నిలిచే ఉండే అమరజీవి కన్నెగంటి హనుమంతు. నిబద్ధత, నీతి నిజాయితీలకు, ధైర్య సాహసాలకు, త్యాగాశీలతకు శాశ్వత చిరునామా శ్రీ కన్నెగంటి హనుమంతు.

* ఆ అమహావీరుని వర్ధంతి నేడు

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.