
బెంగళూరు: నడిచి వచ్చే దేవుడిగా పూజించిన కర్ణాటకలోని శ్రీ సిద్దగంగ మఠాధిపతి శ్రీ శివకుమారస్వామీజీ (111) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. లక్షాలది మంది భక్తులు స్వామీజీని చివరిసారిగా దర్శించుకున్నారు. స్వామీజీకి భారతరత్న ఇవ్వాలని రాజకీయాలకు అతీతంగా డిమాండ్ చేస్తున్నారు. సిద్దగంగ మఠం దగ్గర దాదాపు రెండు కిలోమీటర్ల పోడువు శ్రీ శివకుమారస్వామీజీని కడసారి దర్శించుకోవడానికి భక్తులు క్యూలో నిల్చుకున్నారు. కర్ణాటకతో పాటు దేశంలోని వివిద ప్రాంతాల నుంచి వచ్చిన స్వామీజీ భక్తులు సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు అక్కడే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ స్వామీజీ అంత్యక్రియలకు హాజరైనారు. పేద ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన స్వామీజీకి భారతరత్న ఇవ్వాలని పలువురు నేతలు, ప్రజలు, స్వామీజీ భక్తులు డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో తాను మాట్లాడుతానని, స్వామీజీకి భారతరత్న వచ్చే విధంగా చూస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తుమకూరులో మంగళవారం స్వచ్చందంగా బంద్ చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తుమకూరు ప్రజలు ఉచితంగా భోజనం, తాగునీరు అందించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు శ్రీ శివకుమారస్వామీజీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా సేవచేసి తన జీవితం త్యాగం చేసిన శ్రీ శివకుమారస్వామీజీకి మఠం విద్యాసంస్థల విద్యార్థులు కన్నీటితో వీడ్కోలు పలికారు.
Source : One India





