
-
నిధులు సమకూర్చునున్న ఆయా దేశాలు
న్యూఢిల్లీ: భారతదేశంలో అతిపెద్ద ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటైన ఐఐటీ-ఢిల్లీ విదేశాలలో కూడా శాఖలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం సౌదీ అరేబియా, ఈజిప్టు దేశాలలో క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో చర్చలు కూడా జరుపుతోంది. భారతదేశంలోని ఐఐటీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చే లక్ష్యంతో ఈ విదేశీ క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల్లో నెలకొల్పే ఇంజనీరింగ్ క్యాంపస్లకు పూర్తిగా ఆయా దేశాల ప్రభుత్వాలే నిధులందిస్తాయి.
కానీ, అఫిలియేషన్, సిలబస్ తదితర విషయాల్లో మాత్రం ఐఐటీ ఢిల్లీ బాధ్యత తీసుకుంటుంది. ఈ విదేశీ క్యాంపస్లలో చేరేందుకు జేఈఈ కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో మరో రకంగా పరీక్ష నిర్వహిస్తారని సమాచారం. ఈ క్యాంపస్లలో ప్రవేశం పొందిన విద్యార్థులు తమ కోర్సు మొదటి ఏడాదిని భారత దేశంలో చదివిన తరువాత మిగిలిన సంవత్సరాలలో తమ దేశాలలో ఉన్న క్యాంపస్లలో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో విద్యాప్రమాణాలు ఉన్నత స్థాయిలో లేవు. సౌదీ అరేబియా, ఈజిప్టులలో క్యాంపస్లు అందుబాటులోకి వస్తే ఆయా దేశాల్లో ఉన్న విద్యార్థులతో పాటు ఎన్నారైలకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.





