వివాదాలకు కేంద్రబిందువైన చైనా సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచ దేశాలతో తగువులు పెట్టుకుంటోంది. విస్తరణవాదంతో ముందుకెళుతుండడంతో ఆ ప్రభావం దేశ రక్షణ ఎగుమతులపై పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా చైనా రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. కరోనా మహమ్మారికి చైనానే ఆజ్యం పోసిందని అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తూ వచ్చాయి. దీనికి తోడు డ్రాగన్ నావికాదళాలు ఫిలిప్పీన్స్ సహా ఇతర దేశాల సముద్ర జలాల్లో అనధికారికంగా ప్రవేశించడం అంతర్జాతీయంగా వివాదాలకు దారితీస్తోంది.
మరోవైపు లడ్డాఖ్ వివాదంతో భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించినట్లు అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ నివేదిక వెల్లడించింది. ఓ వైపు చైనా రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు అంతకంతకూ తగ్గుతున్నాయి. మరోవైపు ఆయుధాల కోసం విదేశాలపైనే ఎక్కువ ఆధారపడుతున్న భారత్ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తోంది. 2011-20 మధ్యకాలంలో భారత ఆయుధ దిగుమతులు 33 శాతం తగ్గితే చైనా ఆయుధ ఎగుమతులు 7.8 శాతం తగ్గిపోవడం గమనార్హం.