పాకిస్థాన్ ను గ్రే జాబితాలో పెట్టిన ఎఫ్ఏటీఎఫ్… ఉగ్రవాదులకు సహకరిస్తోందని ఆరోపణ… అంతర్జాతీయ ఆర్థిక సహాయానికి నిరాకరణ

అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని గ్రే లిస్టులోనే కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) నిర్ణయించింది. నిర్దేశించిన 27 విధుల్లో ఇంకా ఒకదాన్ని పూర్తి చేయటంలో ఆ దేశం విఫలమవ్వగా ఈ నిర్ణయం తీసుకుంది.
పారిస్లో ఎఫ్ఏటీఎప్ ప్లీనరీ సమావేశం జూన్ 21 నుంచి 25 మధ్య జరిగింది. పాకిస్థాన్పై ఆసియా పసిఫిక్ గ్రూప్ సమర్పించిన నివేదికను ఈ సమావేశంలో ఎఫ్ఏటీఎఫ్ సమీక్షించింది. జూన్ 23న జరిగిన సమావేశంలో పాకిస్థాన్ను గ్రే లిస్టులో ఉంచాలా? వద్దా? అనే దానిపై ఎఫ్ఏటీఎఫ్ చర్చించినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది.
గ్రే లిస్టులో ఉన్నందున అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సహా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి పాక్ ఎలాంటి ఆర్థిక సాయాన్ని పొందలేదు. మూడేళ్లుగా గ్రే జాబితాలోనే కొనసాగుతన్న పాకిస్థాన్.. ఆ జాబితా నుంచి బయటపడేందుకు విఫలయత్నం చేస్తోంది. అయితే.. ఉగ్రవాదులకు రక్షణ కల్పించటం, ఎఫ్ఏటీఎఫ్ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయకపోవటం వంటివి ఆ దేశానికి అంతర్జాతీయ నిధులను అందుకోవటంలో అడ్డంకిగా నిలుస్తున్నాయి.