
తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంలో రాజీనామాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పటికే చాలా మంది పార్టీని వీడగా.. తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు కమల్కు లేఖ వ్రాశారు.
మహేంద్రన్ రాజీనామాపై కమల్ హాసన్ మండిపడ్డారు. ఆయన్ను ‘ద్రోహి’గా అభివర్ణించారు. మహేంద్రన్ రాజీనామా చేయకపోయినా పార్టీ నుంచి తామే తొలగించేవారమని తెలిపారు. పార్టీ నుంచి ఓ ‘కలుపు మొక్క’ బయటకు వెళ్లిందని.. దానికి తాము హర్షిస్తున్నామన్నారు. పిరికిపందల్లా పార్టీని వీడేవారి గురించి ఆలోచించేది లేదని తెలిపారు. ఏ కొద్దిమంది రాజీనామాల వల్ల పార్టీ లక్ష్యం మారదని పేర్కొన్నారు.
రాజీనామా లేఖలో మహేంద్రన్ కమల్ పై పలు తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో కొందరు సలహాదారులు కమల్ను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే కమల్ పార్టీ నడిపే తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదన్నారు. పార్టీలో ‘విభజించు-పాలించు’ విధానం అమల్లో ఉందని ఆరోపించారు.
మహేంద్రన్తో పాటు పార్టీలో కీలక నేతలైన ఏజీ.మౌర్య, మురుగనందమ్, సీకే.కుమరావెల్, ఉమాదేవి సైతం రాజీనామా చేసినట్లు పార్టీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.





