News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ వరాలు

716views

రోనా వేళ ఆర్థిక వ్యవస్థ కుదేలైన వేళ వినిమయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది. పండగ వేళ పలు ప్యాకేజీలు ప్రకటించింది. ప్రయాణ ఓచర్లతో పాటు ప్రతి ఉద్యోగికి పండగ అడ్వాన్స్‌ ఇవ్వనుంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ఈ పథకాలను ప్రకటించారు. ఇందులో ఒకటి ఎల్‌టీసీ(లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌) ఓచర్‌. విహారయాత్రలు లేదా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రతి నాలుగేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఎల్‌టీసీలు ఇస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు కష్టతరమైన నేపథ్యంలో చాలా మంది ఈ కన్సెషన్‌ను వినియోగించుకోలేకపోయారు. అందుకే ప్రభుత్వం ఈ ఎల్‌టీసీలను నగదు ఓచర్ల రూపంలోకి మార్చింది. వీటిని ఉద్యోగులు 2021 మార్చి 31 వరకు ఉపయోగించుకోవచ్చు.

అయితే లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్ కింద ఇచ్చే నగదు ఓచర్లపై కొన్ని పరిమితులు విధించింది. ఉద్యోగులు కేవలం ఆహారేతర వస్తువులు మాత్రమే కొనుక్కోవాలి. అవి కూడా 12శాతం అంతకంటే ఎక్కువ జీఎస్‌టీ అమలయ్యే వస్తువులే అయి ఉండాలి. వీటిని జీఎస్‌టీ నమోదిత అవుట్‌లెట్లలో డిజిటల్‌ రూపంలో మాత్రమే కొనుగోలు చేయాలి అని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఇక దీంతో పాటు ఉద్యోగులకు పండగ బొనాంజాను కూడా కేంద్రం ప్రకటించింది. పండగ అడ్వాన్స్‌ కింద ప్రతి ఉద్యోగికి కేంద్రం రూ. 10,000 ఇవ్వనుంది. ప్రీపెయిడ్‌ రూపే కార్డుల్లో ఈ నగదు జమ అవుతుంది. దీన్ని వచ్చే ఏడాది మార్చి 31లోగా వాడుకోవాలి. ఈ అడ్వాన్స్‌ను ఉద్యోగులు 10వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.