
పాకిస్థాన్లోని ఘావూ, మాష్కే మిలిటరీ ప్రాంతాల్లో జవానులపై దాడులకు పాల్పడ్డట్లు బలూచిస్థాన్ రెబెలియన్ ఫ్రంట్ వెల్లడించింది. బలూచిస్థాన్ రెబెలియన్ ఫ్రంట్ ప్రతినిధి గ్వహ్రమ్ బలోచ్ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ గత రాత్రి సర్మాచారులు (బలోచ్ స్వతంత్ర్యం కోసం పోరాడుతున్నవారు) మాష్కేలోని మంగులి చెక్పోస్టుపై స్నైపర్లు, భారీ ఆయుధాలతో దాడిచేసి ముగ్గురు జవాన్లను హత్య చేసినట్లు ఫ్రంట్ పేర్కొంది. ఈ దాడిలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది. దరజ్ కౌర్ నదీ ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లను హతమార్చినట్లు వెల్లడించింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బలోచ్ గొరిల్లా ఫైటర్లపై పాకిస్థాన్ ఆర్మీ బృందం ఆకస్మిక దాడికి పాల్పడిందని, కాగా ఈ ఘటనలో నలుగురు పాక్ జవాన్లను మట్టుబెట్టినట్లు ఫ్రంట్ పేర్కొంది. మరో ఇద్దరిని గాయపరిచినట్లు తెలిపింది. పాక్ ఆక్రమిత బలూచిస్థాన్కు స్వాతంత్య్రం లభించే వరకు ఆ దాడులు కొనసాగుతాయని గ్వహ్రమ్ బలోచ్ ఆ ప్రకటనలో పేర్కొన్నాడు.




