
జమ్మూ-కశ్మీర్లోని కృష్ణ ఘాటీ సెక్టార్ ప్రాంతంలో శుక్రవారం పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనలో ముగ్గురు సాధారణ పౌరులు మరణించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
ఈ ఘటనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్లోని పాకిస్థాన్ రాయబారికి విదేశాంగ శాఖ శనివారం సమన్లు జారీ చేసింది. ”పాకిస్తాన్ హైకమిషన్లోని తాత్కాలిక రాయబారికి సమన్లు జారీ చేశాం. అమాయక పౌరుల మృతి విషయంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశాం. భారత్లోని సాధారణ పౌరుల్ని కావాలనే పాక్ సైన్యం లక్ష్యంగా చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం” అని ఓ ప్రకటనలో విదేశాంగ శాఖ పేర్కొంది. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని పాక్కు సూచించింది. అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంపైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
ఈ ఏడాది పాక్ 2711 సార్లు పాక్ పైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఈ ఘటనల్లో 21 మంది సాధారణ పౌరులు మరణించారని విదేశాంగ శాఖ తెలిపింది. మరో 94 మంది తీవ్రంగా గాయపడ్డారు.





