
వినాయక చవితి అంటే భక్తి.. ఉత్సాహం.. సంప్రదాయం. అయితే దేశవ్యాప్తంగా సామూహికంగా జరిగే గణేశోత్సవాలకు ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేశుడి ఉత్సవాలను సామాజిక, జాతీయ చైతన్యానికి వేదికగా మలిచారు.
19వ శతాబ్దం చివరి దశలో భారతీయ సమాజం అనేక సామాజిక విభజనలతో సతమతమవుతున్న సమయంలో.. ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి సామూహిక గణేశోత్సవాలను తిలక్ ప్రోత్సహించారు. భక్తిని సామాజిక ఐక్యతతో ముడిపెట్టిన ఈ ప్రయత్నం క్రమంగా ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది.
1893లో సామూహిక గణేశోత్సవాలకు శ్రీకారం
చరిత్రకారుల ప్రకారం 1893లో మహారాష్ట్రలో తిలక్ ఆధ్వర్యంలో సామూహిక గణేశోత్సవాలకు కొత్త రూపు వచ్చింది. అప్పటివరకు గణేశుడిని ప్రధానంగా కుటుంబాలు, స్థానిక సమూహాలు తమ తమ పరిధిలో పూజించేవి. తిలక్ మాత్రం గణేశోత్సవాన్ని ప్రజలందరినీ కలిపే సామాజిక వేదికగా చూశారు. కులం, వర్గం, ప్రాంతం వంటి భేదాలను పక్కన పెట్టి ప్రజలంతా ఒకే చోట చేరి గణపతిని పూజించడం.. పరస్పరం కలుసుకోవడం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజంలో ఐక్యత పెరుగుతుందని ఆయన భావించారు.అలా ఇంటింటి పండుగ.. ప్రజల పండుగగా మారింది.
గణేశుడి వేదికగా జాతీయ చైతన్యం
బ్రిటిష్ పాలనలో రాజకీయ సమావేశాలు, ప్రజా సమీకరణలపై ఆంక్షలు ఉన్న సమయంలో మత, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరడం సాధ్యమయ్యేది. ఈ పరిస్థితిని తిలక్ సమర్థంగా ఉపయోగించుకున్నారు. గణేశోత్సవాల సందర్భంగా ప్రజలు ఒకచోట చేరేలా చేసి.. సామాజిక సమస్యలు, దేశ పరిస్థితి, స్వదేశీ భావన, స్వాతంత్య్రం వంటి అంశాలపై చర్చలకు అవకాశం కల్పించారు. అందుకే సామూహిక గణేశోత్సవాలు కేవలం పూజా కార్యక్రమాలుగా కాకుండా ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించే వేదికలుగా కూడా మారాయి.
కులభేదాలను దాటి ఒకే పందిరి కింద
తిలక్ ఆలోచనలో సామాజిక ఐక్యతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఒకే పందిరి కింద వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కలిసి గణపతిని పూజించడం ద్వారా పరస్పర దూరాలు తగ్గుతాయని భావించారు. గణేశుడి ముందు అందరూ సమానమే అనే భావన ప్రజల్లో బలపడాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుడి ప్రతిష్ఠ నుంచి నిమజ్జనం వరకు సామూహికంగా పాల్గొనడం ద్వారా కలిసి నడవడం.. కలిసి పూజించడం.. కలిసి ఉత్సవాన్ని నిర్వహించడం వంటి సామాజిక భావనలు బలపడ్డాయి.
అప్పట్లో ఎన్నో సవాళ్లు
సామూహిక గణేశోత్సవాలను నిర్వహించడం తేలికైన విషయం కాదు. సామాజికంగా భిన్నాభిప్రాయాలు ఉండటంతో పాటు, బ్రిటిష్ పాలకుల అనుమానాలు కూడా ఎదురయ్యాయి.అయితే తిలక్తో పాటు జాతీయోద్యమానికి చెందిన పలువురు నాయకులు ప్రజల్లో సాంస్కృతిక, జాతీయ చైతన్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తించారు. లాలా లజపతిరాయ్, బిపిన్చంద్ర పాల్, అరవింద ఘోష్ తదితర జాతీయవాద నాయకులు కూడా భారతీయ సంస్కృతి, జాతీయ చైతన్యాల మధ్య సంబంధాన్ని బలంగా విశ్వసించినవారిలో ఉన్నారు.
మహారాష్ట్రలో ఉద్యమంగా విస్తరణ
సామూహిక గణేశోత్సవాలు ముఖ్యంగా మహారాష్ట్రలో విశేష ఆదరణ పొందాయి. పుణె, ముంబైతో పాటు నాగ్పూర్, వార్ధా, అమరావతి వంటి ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు ప్రజా జీవితంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నాయి. గణేశోత్సవాల ద్వారా ప్రజలు ఒకచోట చేరడం.. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం.. దేశభక్తి గీతాలు, ఉపన్యాసాలు, నాటకాలు వంటి కార్యక్రమాలకు వేదిక ఏర్పడటం ద్వారా జాతీయోద్యమ భావాలు ప్రజల్లోకి విస్తరించాయి.
బ్రిటిష్ పాలకుల్లో పెరిగిన ఆందోళన
సామూహిక గణేశోత్సవాలు పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించడంతో బ్రిటిష్ అధికారుల్లో కూడా ఆందోళన పెరిగింది. మతపరమైన కార్యక్రమాల పేరుతో జరుగుతున్న ప్రజా సమీకరణలు రాజకీయ చైతన్యానికి దారితీస్తున్నాయనే అభిప్రాయాలు అప్పటి వలస పాలనా వర్గాల్లో వ్యక్తమయ్యాయి.తరువాతి కాలంలో ఇటువంటి ప్రజా ఉత్సవాలు జాతీయోద్యమానికి సామాజిక మద్దతు పెరగడానికి తోడ్పడిన అంశాల్లో ఒకటిగా చరిత్రలో ప్రస్తావించబడ్డాయి.
నేడు దేశవ్యాప్తంగా గణేశోత్సవం
కాలక్రమంలో గణేశోత్సవాల రూపం మారింది. మహారాష్ట్రకు పరిమితమైన సామూహిక గణపతి ఉత్సవాల స్ఫూర్తి దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది.మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ సామూహిక గణేశోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తి, కళ, సంస్కృతి, సామాజిక ఐక్యతకు ఈ ఉత్సవాలు వేదికలుగా నిలుస్తున్నాయి.
తిలక్ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి
నేటి తరానికి సామూహిక గణేశోత్సవం ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుక. కానీ దాని చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తిలక్ గణేశోత్సవాల ద్వారా ఆశించిన ప్రధాన లక్ష్యాల్లో ప్రజల ఐక్యత, సామాజిక చైతన్యం, జాతీయ భావన ముఖ్యమైనవి. అందువల్ల ఉత్సవాల పవిత్రతను కాపాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, సమాజంలోని అందరినీ కలుపుకొనే విధంగా వేడుకలను నిర్వహించడం మరింత సముచితం. గణపతి కేవలం విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు.. ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురాగల సామాజిక స్ఫూర్తికి కూడా ప్రతీక.
అందుకే ఈ వినాయక చవితికి గణనాథుడిని భక్తితో పూజిద్దాం.. తిలక్ చూపిన ఐక్యత, చైతన్యం, జాతీయ స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం అడుగులు వేద్దాం.





