News

అయోధ్యలో చేపల విందుపై వివాదం.. శ్రావణ మాసంలో ఇదేం పని అంటూ సాధువుల ఆగ్రహం

30views

అయోధ్య: పవిత్ర శ్రావణ మాసంలో అయోధ్యలో చేపల విందు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌ అయోధ్య పర్యటన సందర్భంగా నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో అతిథుల కోసం చేపల వంటకాలు సిద్ధం చేయడంపై కొందరు సాధువులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీరాముడు కొలువైన పవిత్ర నగరంలో, అందులోనూ శ్రావణ మాసంలో ఇలాంటి విందు ఏర్పాటు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీస్తుందని వారు పేర్కొన్నారు.

అయోధ్య రామ మందిర విరాళాల వ్యవహారంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అజయ్‌ రాయ్‌ ఆదివారం అయోధ్యలో పర్యటించారు. తొలుత శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్‌ గఢీ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తరుణ్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ నేత రామ్‌ నిహాల్‌ నిషాద్‌ ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రాజ్‌పాల్‌ గౌతమ్‌, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అఖిలేశ్‌ ప్రతాప్‌ సింగ్‌, పూర్వాంచల్‌ ఇన్‌చార్జ్‌ అభిషేక్‌ దత్‌ తదితరులు హాజరయ్యారు.

కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, అతిథులు రావడంతో వారికి వివిధ రకాల వంటకాలు సిద్ధం చేశారు. ఇందులో చేపల వంటకాలు కూడా ఉండటంతో వివాదం మొదలైంది.

వీడియోలు వైరల్‌.. సాధువుల అభ్యంతరం
కార్యక్రమ వేదిక వద్ద చేపలు వండుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షం కురుస్తున్న సమయంలోనే అక్కడ చేపలు వండుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోలపై స్పందించిన కొందరు స్థానిక సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

శ్రావణ మాసంలో అయోధ్య వంటి పవిత్ర ప్రాంతంలో చేపల విందు ఏర్పాటు చేయడం మత విశ్వాసాలను, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని వారు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను పవిత్ర నగరంలో నిర్వహించడం తగదని అభిప్రాయపడ్డారు.