
తిరుమల:తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్న నేపథ్యంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తొమ్మిది రోజుల పాటు అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
అదే విధంగా వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలతో వచ్చే తల్లిదండ్రులు, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలను కూడా బ్రహ్మోత్సవాల కాలంలో తాత్కాలికంగా రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున, సాధారణ భక్తులకు సాఫీగా దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఆయా సేవలు, ప్రత్యేక దర్శనాలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని టీటీడీ స్పష్టం చేసింది.





