
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో గల వివాదాస్పద భోజ్శాల-కమల్ మౌలా ప్రాంగణం కేసులో సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భోజ్శాలను సరస్వతీ దేవి ఆలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే, ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకునేందుకు వీలుగా సదరు ప్రాంగణానికి ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య నమాజ్కు అనుమతించాలని ఈ సందర్భంగా కోర్టు సూచించింది.
ఈ వివాదంపై ముస్లిం సంఘాలు దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇది అత్యంత సున్నితమైన అంశమని, ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోర్టు హితవు పలికింది. ఈ కేసుపై రెండు మూడు వారాల్లో వేగవంతంగా, వీలైతే రోజువారీ పద్ధతిలో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు భోజ్శాల ప్రాంగణంలో ఎలాంటి నిర్మాణపరమైన మార్పులు చేపట్టవద్దని భారత పురావస్తుశాఖను (ఏఎస్ఐ) ఆదేశించింది. భోజ్శాల ప్రాంగణం లోపలే నమాజ్ చేసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించినప్పటికీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది.
11వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడంపై హిందూ, ముస్లిం వర్గాలు సుదీర్ఘకాలంగా పరస్పర వాదనలు వినిపిస్తున్నాయి. ఇది రాజాభోజ్ నిర్మించిన వాగ్దేవి (సరస్వతి) ఆలయమని హిందువులు విశ్వసిస్తుండగా, దీనిని కమల్ మౌలా మసీదుగా ముస్లింలు పరిగణిస్తున్నారు. 2024లో ఏఎస్ఐ నిర్వహించిన సర్వే ఆధారంగా, ఈ ఏడాది మే 15న మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్శాలను ఆలయంగా ప్రకటిస్తూ, అక్కడ నమాజ్ నిర్వహణను నిషేధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ముస్లిం పక్షాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.




