News

బంగ్లాదేశ్‌లో ఐదు నెలల్లో మైనారిటీలపై 645 ఘటనలు

39views

బంగ్లాదేశ్‌లో 2026 ఫిబ్రవరి 12న జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం గత ఐదు నెలల్లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని మొత్తం 645 ఘటనలు నమోదైనట్లు పలు మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. ఐన్ ఓ సలీష్ కేంద్ర (ASK), బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రైస్తవ ఐక్యతా మండలి, బంగ్లాదేశ్ మైనారిటీల కోసం మానవ హక్కుల కాంగ్రెస్ (HRCBM) విడుదల చేసిన వివరాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

సంస్థల నివేదికల ప్రకారం, హిందూ సమాజం, ఇస్కాన్ సంస్థలను లక్ష్యంగా చేసుకున్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా జరుగుతోందని పేర్కొన్నారు. స్థానిక ముస్లిం సంఘాల పేరుతో మైనారిటీలను సామాజికంగా బహిష్కరించాలని, వారి సంస్థలను నిషేధించాలని పిలుపునిస్తున్న పోస్టులు వెలువడుతున్నాయని, పలుచోట్ల మైనారిటీ వర్గాలకు బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయని నివేదికల్లో పేర్కొన్నారు.

మానవ హక్కుల సంస్థల గణాంకాల ప్రకారం, 132 భూకబ్జా కేసులు నమోదయ్యాయి. అనేక మైనారిటీ కుటుంబాలు తమ ఆస్తులను ఖాళీ చేయించాలని, ఇళ్లను ధ్వంసం చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినట్లు తెలిపాయి. అలాగే 95 హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయని లేదా అపవిత్రం చేయబడ్డాయని నివేదిక పేర్కొంది.

కొమిల్లాకు చెందిన నందిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా హిందూ వ్యతిరేక భావజాలాన్ని రెచ్చగొట్టే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. కుట్ర సిద్ధాంతాలను ప్రోత్సహించే సందేశాలు నిరంతరం ప్రచారం అవుతున్నాయని, వాటిని అరికట్టకపోతే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. గైబంధలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం కూడా ఒక రాజకీయ కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు.

బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రైస్తవ ఐక్యతా మండలి ప్రధాన కార్యదర్శి మనీంద్ర కుమార్ నాథ్ మాట్లాడుతూ, ఒక వర్గంలో భయాన్ని కలిగించడానికి ప్రత్యక్ష హింస మాత్రమే కాకుండా, నిరంతర బెదిరింపులు కూడా కారణమవుతాయని అన్నారు. బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల న్యాయవ్యవస్థ, పరిపాలనపై ప్రజల విశ్వాసం దెబ్బతింటోందని పేర్కొన్నారు.

ప్రమేయం ఉన్నవారిపై తగిన చర్యలు తీసుకోవడంలో పరిపాలన యంత్రాంగం విఫలమవుతోందని, దీనివల్ల మైనారిటీ వర్గాల్లో అభద్రతా భావం మరింత పెరుగుతోందని మానవ హక్కుల సంస్థలు ఆరోపించాయి.