News

వాగ్దేవి విగ్రహాంపై మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు హిందూ పిటిషనర్ల విజ్ఞప్తి

38views

కోహినూర్‌ కంటే వాగ్దేవి (సరస్వతీ దేవి) విగ్రహమే ముఖ్యమైనదని, లండన్‌ మ్యూజియం నుంచి ఆ ప్రతిమను తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని మధ్యప్రదేశ్‌ హైకోర్టులో పలు హిందూ సంఘాలు పిటిషన్‌ దాఖలు చేశాయి. వివాదాస్పద భోజ్‌శాల- కమల్‌ మౌలా మసీదు కాంప్లెక్స్‌.. సరస్వతీ దేవి ఆలయానికే చెందుతుందని ఈ నెల 15న తీర్పు వెలువడిన అనంతరం హిందువులు అక్కడ వాగ్దేవి విగ్రహ ప్రతిరూపాన్ని నెలకొల్పి పూజలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో లండన్‌ మ్యూజియంలో ఉన్న సరస్వతీ మూల ప్రతిమను భోజ్‌శాలలో తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు మంగళవారం డిమాండ్‌ చేశారు. లండన్‌ నుంచి సరస్వతీ దేవి విగ్రహాన్ని తీసుకువచ్చి భోజ్‌శాల ప్రాంగణంలో పునఃప్రతిష్ఠించాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులను భారత ప్రభుత్వం పరిశీలించొచ్చని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘‘ కోహినూర్‌లా వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలనే అంశం కూడా ముఖ్యమైనదే. మాకు ఈ విగ్రహం కోహినూర్‌ కంటే విలువైనది. ఇది మత విశ్వాసం, సాంస్కృతిక వారసత్వంతో ముడిపడిన అంశం. కేంద్రం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తే లండన్‌ నుంచి విగ్రహాన్ని తిరిగి తీసుకురావొచ్చు. 2024లో భోజ్‌శాల ప్రాంగణంలో పురావస్తు శాఖకు లభించిన 94 విగ్రహాలనూ ఈ ప్రాంతంలో తిరిగి ప్రతిష్ఠించాలి’’ అని పిటిషనర్లు కోరారు.