
4views
హిమాచల్ ప్రదేశ్ లో నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ, మత మార్పిడులు, గోవుల అక్రమ రవాణా, భూ ఆక్రమణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆలయాలను రాష్ట్ర నియంత్రణ నుంచి విడిపించాలని వీహెచ్పీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ప్రసంగిస్తూ..భారతదేశం ఒక లౌకిక దేశం. ఇక్కడ ఏ గురుద్వారా, మసీదు, చర్చి, బౌద్ధ విహారం లేదా జైన దేవాలయాన్ని ఏ ప్రభుత్వమూ నిర్వహించదు. కానీ దురదృష్టవశాత్తు, హిమాచల్ ప్రభుత్వం హిందూ సమాజానికి చెందిన 37 అతిపెద్ద దేవాలయాలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు ఈ ప్రధాన దేవాలయాలన్నింటి నిర్వహణను కూడా హిందూ సమాజానికే అప్పగించాల్సిన సమయం ఆసన్నమైంది. అదే సమయంలో, రాష్ట్రంలో మత మార్పిడులు, గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా అత్యవసరం అని మిలింద్ పరాండే అన్నారు.
వారు మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్లోని హిందూ దేవాలయాలు, 1984 నాటి హిందూ ప్రజా మత సంస్థలు ధార్మిక దానాల చట్టం ప్రకారం ఒక కమిషనర్ పర్యవేక్షణలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అదే కమిషనర్ తన సౌలభ్యం మేరకు ఈ దేవాలయాల ధర్మకర్తలను నామినేట్ చేస్తారు. ఫలితంగా, దేవాలయాలు ప్రభుత్వ జోక్యాన్ని భరిస్తున్నాయి మరియు వాటి మతపరమైన ప్రదేశాల గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం వాటి మత నాయకత్వానికి లేదు. ఈ దేవాలయ ధర్మకర్తలపై ఒత్తిడి తేవడం ద్వారా, ప్రభుత్వం వారి కానుకలలో అధిక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే లౌకిక కార్యకలాపాలకు నిధులుగా మళ్లిస్తోంది, ఈ కారణంగానే రాష్ట్ర గౌరవ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవలసి వచ్చింది అని పేర్కొన్నారు.
సనాతన సంస్కృతిపై విశ్వాసం ఉంచే భక్తులు ప్రతి సంవత్సరం హిందువుల మత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంక్షేమం, ఆలయ అభివృద్ధి, సామూహిక వంటశాలలు, సేవా కార్యక్రమాలు మొదలైన వాటి కోసం ఈ ఆలయాలకు సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా కానుకలు సమర్పిస్తున్నారని ఆయన అన్నారు.ఇది హిందువుల మరియు సనాతన విలువలను విశ్వసించే వారి సొమ్ము అని, భక్తులు దీనిని భగవంతునికి భక్తిశ్రద్ధలతో అర్పించారని గుర్తుంచుకోవాలి అని పేర్కొన్నారు.
దేవాలయాల నిధులు కేవలం హిందూ ధర్మ ప్రచారానికి, గోశాలల నిర్వహణకు మరియు హిందూ విద్యాసంస్థలకే ఖర్చు చేయాలని, కానీ ప్రభుత్వం ఈ నిధులను ఇతర లౌకిక అవసరాలకు మళ్లించడం ధర్మానికి చేసే అపచారమని వారు స్పష్టం చేశారు.
మత మార్పిడుల అంశంపై కూడా తీవ్ర ఆందోళనని వ్యక్తం చేశారు. దేవభూమిగా పిలవబడే హిమాచల్ ప్రదేశ్లో అమాయక ప్రజలను ప్రలోభపెట్టి లేదా భయభ్రాంతులకు గురిచేసి మత మార్పిడిలకు పాల్పడుతున్న శక్తులపై కఠినమైన చట్టాలు అమలు చేయాలని పరాండే డిమాండ్ చేశారు. ఇది కేవలం మతపరమైన మార్పు మాత్రమే కాదని, దేశ జనాభా సమతుల్యతను దెబ్బతీసే కుట్రని వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా, గోవులను హిందూ సమాజం మాతృసమానంగా ఆరాధిస్తుందని, అటువంటి గోవుల అక్రమ రవాణా మరియు గోహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
గోసంరక్షణ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.రాష్ట్రంలోని దేవాలయ భూములు , ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కూడా వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాల ద్వారా రాష్ట్ర పౌరాణిక రూపురేఖలను మార్చే ప్రయత్నం జరుగుతోందని, తక్షణమే ఆక్రమణదారులను ఏరివేయాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజం తన దేవాలయాలను తానే నిర్వహించుకునే సామర్థ్యం కలిగి ఉందని, ప్రభుత్వ జోక్యం లేని స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థ ఏర్పడాలని ఈ సందర్భంగా విహెచ్పి పిలుపునిచ్చింది. ఈ డిమాండ్లు నెరవేరని పక్షంలో హిందూ సమాజాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది. సనాతన ధర్మ రక్షణే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరాటం హిందూ హక్కుల పరిరక్షణలో కీలక ఘట్టంగా నిలుస్తుంది





