News

‘కాంతార’ వివాదం : క్షమాపణకు సిద్ధమైన రణ్‌వీర్.. మైసూరు ఆలయానికి వస్తానని కోర్టుకు హామీ

35views

‘కాంతార’ చిత్రంలోని దైవాన్ని అనుకరించి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ చివరికి వెనక్కి తగ్గారు. ఈ వివాదంపై బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమయ్యారు. మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి, అక్కడ క్షమాపణ కోరతానని ఆయన కర్ణాటక హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఈ మేరకు రణ్‌వీర్ సమర్పించిన అఫిడవిట్‌ను   హైకోర్టు అంగీకరించింది.

జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. రణ్‌వీర్ సింగ్ తరఫున సీనియర్ న్యాయవాది సజ్జన్ పూవయ్య వాదనలు వినిపిస్తూ, నటుడు బేషరతుగా క్షమాపణ చెబుతూ సవరించిన అఫిడవిట్ దాఖలు చేశారని తెలిపారు. త్వరలోనే చాముండి హిల్స్‌కు వెళ్లి తన చర్యకు క్షమాపణ చెబుతారని కోర్టుకు వివరించారు. ఈ హామీని నమోదు చేసుకున్న ధర్మాసనం, నాలుగు వారాల్లోగా ఆలయాన్ని సందర్శించాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని సూచించింది.

ఈ విషయంపై ఫిర్యాదుదారు, న్యాయవాది ప్రశాంత్ మెథల్ మాట్లాడుతూ.. ఈ కేసు పరిష్కారమైందని తెలిపారు. రణ్‌వీర్ “తగిన సమయంలో” ఆలయానికి వస్తానని అఫిడవిట్‌లో పేర్కొనగా, ఆ సమయం ఎప్పుడని తాము వాదించామన్నారు. భద్రతా కారణాల రీత్యా కచ్చితమైన తేదీ చెప్పలేమని నటుడి తరఫు న్యాయవాది చెప్పారని, అయితే కర్ణాటక పోలీసులు పటిష్ఠమైన భద్రత కల్పించగలరని తాము ధీమా వ్యక్తం చేశామని ఆయన వివరించారు. నటుడు క్షమాపణ చెప్పడానికి ముందుకొచ్చినందున ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించడమే సముచితమని ప్రశాంత్ పేర్కొన్నారు.

2025 నవంబర్ 28న గోవాలో జరిగిన 55వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణ్‌వీర్ సింగ్ ‘కాంతార చాప్టర్-1’లోని పంజుర్లి/గుళిగ దైవాన్ని అనుకరిస్తూ, దైవాన్ని “ఆడ దెయ్యం”గా అభివర్ణించడం వివాదానికి దారితీసింది. దీంతో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ప్రశాంత్ మెథల్ ఫిర్యాదు చేయగా, రణ్‌వీర్‌పై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదైంది.