News

మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

112views

దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం సాకారం కానుంది. ఒడిశాలోని కంథమాల్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ ఎదుట 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో నీతూ కూడా ఉన్నారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ సభ్యురాలు ఆమె కొనసాగుతున్నారని చెప్పారు. వీరిపై మొత్తం రూ.1.65 కోట్ల రివార్డు ఉందని ఎస్పీ వివరించారు.

2026, మార్చి 31వ తేదీ నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్రం ఆపరేషన్ కగార్‌ను చేపట్టింది. కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దేశంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశాలలో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో వీరి ప్రభావం అధికంగా ఉండడంతో.. పోలీసులతోపాటు కేంద్ర భద్రతా బలగాలు నిరంతరాయంగా కూంబింగ్ నిర్వహించాయి. దీంతో ఈ రాష్ట్రంలో భారీగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. దీనిలో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. అలాగే భారీగా మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. పలువురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల కూంబింగ్ పెరగడంతో.. ఆ రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్న జార్ఖండ్, ఒడిశాలోకి ప్రవేశించారు. ఆయా రాష్ట్రాల్లో సైతం పోలీసులు కూంబింగ్ చేపట్టడంతో.. వారంతా పోలీసుల ఎదుట లొంగిపోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎదుట పలువురు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగిపోయిన విషయం విదితమే. ఆపరేషన్ కగార్ ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది.