
ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎవరూ ఆసక్తి చూపడం లేదని, ఇది కేవలం విద్వేషాన్ని పెంచే సాధనంగా మారిందని ఆయన విమర్శించారు. అయితే ఈ ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రానికి బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ మద్దతుగా నిలిచారు.
బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ ఈ చిత్రానికి మద్దతుగా నిలిచారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ‘లోకం అన్న తర్వాత రకరకాల మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇంటి వద్ద కూర్చుని విమర్శలు చేసే కంటే, థియేటర్లకు వెళ్లి సినిమా చూడమని నేను కోరుతున్నాను. ఆ తర్వాతే ఇది ప్రచార చిత్రమా లేక సమాజానికి అద్దం పట్టే వాస్తవమా అనేది అర్థమవుతుంది. హిందూ అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేధింపులకు ఇది నిదర్శనం. ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఆమె పేర్కొన్నారు.





