
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఇదే మండలం అనంతవరప్పాడుకు చెందిన సేంద్రియ వ్యవసాయ రైతు బండారు శ్రీనివాసరావు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఢిల్లీలో నిర్వహించిన ‘పూసా కృషి విజ్ఞాన్ మేళా 2026’లో ‘ఫెలో ఫార్మర్’ పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.
భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్ జాట్, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యడ్లపల్లి మాట్లాడుతూ చిరుధాన్యాల నుంచి ఉప ఉత్పత్తుల తయారీ, విలువ జోడింపు, సేంద్రియ వ్యవసాయంపై తెలుగు రాష్ట్రాల రైతులకు అవగాహన కల్పించడం, ప్రకృతి విధానంలో సాగు తదితర అంశాల్లో చేస్తున్న కృషికిగాను తనకు ఈ అవార్డు లభించిందని తెలిపారు. అధునాతన పద్ధతుల్లో సేంద్రియ విధానంలో పంటల సాగుకు గాను తనకు పురస్కారం లభించినట్లు బండారు శ్రీనివాసరావు చెప్పారు.





