
ఆమె బ్రిటన్లో జన్మించారు. భారతదేశంపై ప్రేమ పెంచుకుని ఇక్కడే ఉండిపోయారు. కేరళలో స్థిర నివాసం ఏర్పరుచుకుని, అనేక రచనలు చేయడంతో పాటు, స్థానిక కళల ప్రాచుర్యానికి పాటుపడ్డారు. ఈ నేపధ్యంలో భారత పౌరసత్వం పొందాలని ఆమె తాపత్రయ పడ్డారు. ఎట్టకేలకు ఆమె తన కలను నెరవేర్చుకున్నారు. ఆమె మరెవరో కాదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత పెపిటా సేథ్ (84). తాజాగా ఆమె అధికారికంగా భారత పౌరసత్వాన్ని పొందారు.
గత 50 ఏళ్లుగా కేరళలోనే ఉంటున్న పెపిటా సేథ్.. 2024లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా త్రిశూర్ జిల్లా కలెక్టర్ అర్జున్ పాండియన్ చేతుల మీదుగా ఆమె పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. సహజసిద్ధ పౌరసత్వ విధానం ద్వారా ఆమెకు ఈ గుర్తింపు లభించిందని అధికారులు వెల్లడించారు. తనకు భారత పౌరసత్వం రావడంపై పెపిటా సేథ్ హర్షం వ్యక్తం చేశారు. ‘నేను ఇక్కడ ఉన్నందుకు, భారత పౌరురాలిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా చిరకాల స్వప్నం’ అని ఆమె పేర్కొన్నారు.
యూకేలో పుట్టి పెరిగిన ఆమె తొలుత భారత్ను సందర్శించేందుకు వచ్చారు. ఢిల్లీ, ముంబై తదితర నగరాలను సందర్శించిన తర్వాత ఆమె కేరళకు చేరుకున్నారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఆమెను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆమె కేరళనే తన నివాసంగా మార్చుకున్నారు. కేరళలోని కథాకళి, తెయ్యం వంటి కళారూపాలతో పాటు స్థానిక ఉత్సవాలైన మేళాలు, ఉత్రాలిక్కావు వంటి కార్యక్రమాలపై పెపిటా సేథ్ ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. ఉత్తర కేరళలో ప్రసిద్ధి చెందిన ‘తెయ్యం’ అనే నృత్యంపై ఆమె పరిశోధన చేసి, పలు పుస్తకాలు కూడా రచించారు.
గత 12 ఏళ్లుగా త్రిస్సూర్లో నివసిస్తున్న ఆమె, ఈ ప్రాంతాన్ని తన పరిశోధనలకు, ప్రయాణాలకు కేంద్ర బిందువుగా మార్చుకున్నారు. ఫోటోగ్రఫీ ద్వారా కేరళ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. కళ, సాంస్కృతిక రంగాల్లో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2012లో ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. పర్యాటకురాలిగా వచ్చి, భారతీయతను అలవరచుకున్న పెపిటా సేథ్ ఇప్పుడు అధికారికంగా భారతీయురాలిగా మారారు.





