
లష్కరే తోయిబా (లష్కర్) టాప్ కమాండర్ అబ్దుల్ గఫర్ అనుమానాస్పదంగా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్లో ఇతడిని హత్య చేసినట్లగా అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిని ఇప్పటి వరకు ఎవరూ ధ్రువీకరించలేదు. కానీ ప్రమాదకరమైన ఉగ్రవాది మాత్రం మరణించినట్లు తెలుస్తోంది. ఇటీవల, పాకిస్తాన్ వ్యాప్తంగా ఇండియా వ్యతిరేక ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు, అజ్ఞాత సాయుధులు హతమారుస్తున్నారు. ఇదే తరహాలో గఫర్ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
నివేదికల ప్రకారం, అతను ఇటీవల బంధువుల వివాహం నుంచి తిరిగి వస్తున్న సమయంలో మార్గం మధ్యలో అనుమానాస్పదంగా మరణించాడు. మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు, అధికారికంగా మరణానికి కారణాలను ఎవరూ వెల్లడించలేదు. అయితే, భారత సోషల్ మీడియా అకౌంట్లలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది. అయితే, ఇది లష్కరే అంతర్గత పోరాటం లేదా లష్కరే తోయిబానే అవసరం తీరిపోయిన తర్వాత చంపేసిందని, ‘‘యూజ్ అండ్ డంప్’’ విధానాన్ని అవలంభిస్తోందని అనుమానిస్తున్నారు. అబ్దుల్ గఫర్ లష్కరే తోయిబాలో కీలక కమాండర్, ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరించేవాడు. ఇటీవల ఇతను హఫీజ్ సయీద్ కొడుకుతో ఒక ఫోటోలో కనిపించాడు.





