News

హిందూ ధర్మంపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు

152views

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, “హిందుత్వం అనేది భయంతో కూడిన హిందూ మతం (Hindutva is Hinduism in paranoia)” అని ఆయన వ్యాఖ్యానించారు. “హిందుత్వానికి రక్షణ అవసరం” అనే అంశంపై ‘కలకత్తా డిబేటింగ్ సర్కిల్’ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయ్యర్ మాట్లాడుతూ, “హిందుత్వం అనేది 80 శాతం ఉన్న హిందువులను, కేవలం 14 శాతం ఉన్న ముస్లింల ముందు వణికేలా చేస్తుంది. క్రిస్మస్ రోజున చర్చిలో భోజనానికి వెళ్లినందుకు ఒక అంధురాలైన గిరిజన బాలికను బీజేపీ నాయకుడు కొట్టడమే హిందుత్వం,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక మతమని, దానికి ‘హిందుత్వ’ రక్షణ అవసరం లేదని, వేల సంవత్సరాలుగా హిందూ మతం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ పార్టీ హిందువుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది స్పందిస్తూ, “హిందూ తత్వమే హిందుత్వం. ప్రపంచంలో కేవలం హిందూ మతం మాత్రమే తన మత గ్రంథాలపై కూడా చర్చించే స్వేచ్ఛను ఇస్తుంది,” అని అయ్యర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అయ్యర్ వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని అవమానించేలా ఉన్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అలాగే పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పందిస్తూ.. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు.