News

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన షేక్‌ హసీనా

190views

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. మైమెన్‌సింగ్‌ నగరంలో ఓ కర్మాగారంలో పనిచేస్తున్న దీపు చంద్ర దాస్‌ అనే 27 ఏండ్ల హిందూ వ్యక్తిని దైవదూషణ ఆరోపణలపై ముస్లిం గుంపు కొట్టి చంపిన విషయం తెలిసిందే. అంతటితో ఆగని మూక.. అతడి మృతదేహాన్ని బహిరంగంగా వేలాడదీసి నిప్పంటించింది. ఈ ఘటన తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.

అంతేకాదు, పలువురు హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టడం, దాడి చేయడం, మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలా వరుస దాడులతో బంగ్లాలోని హిందువులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ దాడులపై బంగ్లాదేశ్‌ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా స్పందించారు. ఇది అనాగరికమైన, సిగ్గు చేటు చర్యగా అభివర్ణించారు.

‘బంగ్లాదేశ్‌లో మతపరమైన హింసకు తావులేదు. అయినప్పటికీ ఇలాంటి చర్యలు తరచూ చోటు చేసుకోవడం ఆందోళనకరం. యూనస్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో దేశంలో హింస పెరిగిపోయింది. మైనారిటీలకు దేశంలో రక్షణ లేకుండా పోయింది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ కనీస విధి. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైంది. ఇది బంగ్లాదేశ్ లోని మైనారిటీలకు మాత్రమే కాదు దేశ లౌకిక, ప్రజాస్వామ్య విధానాలకే ముప్పుగా మారుతోంది’ అని హసీనా అన్నారు.