News

శబరిమలకు ఆధునిక సాంకేతికత.!

186views

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించేలా శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్‌కు చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు , బుకింగ్‌ గదులు వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక. ప్రస్తుతం, వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. సాంకేతిక వ్యవస్థలు ఏయే ప్రాంతాల్లో అవసరమో, వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు.

విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి సంస్థల సహాయంతో దీనిని తయారు చేస్తారు. దీంతోపాటు దేవస్వం బోర్డు అన్ని కార్యాలయాలను డిజిటల్‌గా మార్చనున్నారు. కాగా, శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం ఈ సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.