News

వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ ఉమీద్‌ పోర్టల్‌లో 5.17లక్షల ఆస్తుల నమోదు

150views

వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన ఉమీద్‌ పోర్టల్‌లో గడువు ముగిసే నాటికి(డిసెంబరు 6) 5,17,040 ఆస్తుల వివరాలను అప్‌లోడ్‌ చేశారు. అయితే, ఇందులో ఇప్పటివరకు 2,16,905 ఆస్తులను మాత్రమే వక్ఫ్‌ ప్రాపర్టీలుగా సంబంధిత అధికారులు ఆమోదించారు. 10,869 ఆస్తులను తిరస్కరించారు. మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమాచారాన్ని విడుదల చేసింది. ఉమీద్‌ పోర్టల్‌లో అత్యధికంగా యూపీ నుంచి 92,830 ఆస్తులను నమోదు చేయగా, 62,939ఆస్తులతో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఉంది.

వక్ఫ్‌ ఆస్తులను డిజిటలైజ్‌ చేయాలన్న ఉద్దేశ్యంతో కేంద్రం జూన్‌ 6న ఉమీద్‌ పోర్టల్‌ను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్‌ ఆస్తులను అందులో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. ఇందుకు ఆరు నెలల గడువు ఇస్తూ డిసెంబరు 6ను డెడ్‌లైన్‌గా విధించింది. ఉమీద్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ అయి, ధ్రువీకరించిన ఆస్తులను మాత్రమే వక్ఫ్‌ ఆస్తులుగా గుర్తిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది.