ArticlesNews

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం – భారతీయ వారసత్వ సంస్కృతి

218views

(డిసెంబర్ 10- మానవ హక్కుల దినోత్సవం)

ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటాము. 1948లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించిన రోజు ఇది. 1950డిసెంబర్ 4న జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆ మేరకు యుఎన్ జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం ప్రకారం అన్ని యుఎన్ సభ్య దేశాలను, ఇతర ఆసక్తిగల సంస్థలను 1948 డిసెంబర్ 10న జరిగిన యుడిహెచ్ఆర్ ప్రకటనను గుర్తు చేసుకోవాలని పిలుపిచ్చింది. మానవ హక్కుల దినోత్సవం అని పిలువబడే వార్షిక వేడుకను ఆ రోజున నిర్వహిస్తున్నాము.

మానవ హక్కులను నిలబెట్టే ప్రయత్నంలో ఒక నిర్దిష్ట కోణంలో ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట అంశాన్ని ఎంపిక చేయడం జరుగుతుంది. వివక్షను అంతం చేయడం, పేదరికంపై పోరాటం చేయడం, మానవ హక్కుల ఉల్లంఘన బాధితులను రక్షించడం వంటి అంశాలను ఎంపిక చేస్తున్నారు. యుఎన్ అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరంగా గుర్తించిన 1968 నుండి మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మానవ హక్కుల రంగంలో క్రమానుగతంగా ఐక్యరాజ్యసమితి బహుమతిని అందజేస్తుంది. సామాజిక తత్వశాస్త్రంలో భాగంగా మానవ గౌరవం, హక్కుల పట్ల గౌరవం చాలా కాలంగా భారతీయ నీతిలో అంతర్భాగంగా నెలకొన్నాయి. యూనివర్సల్ డిక్లరేషన్ ముసాయిదా సిద్ధమవుతున్నప్పుడు భారత్ స్వతంత్ర దేశం కాదని బ్రిటిష్ కాలనీ అని గమనించాలి. మానవ హక్కులపై సార్వత్రిక ప్రకటన ముసాయిదా రూపకల్పనలో భారతదేశం చురుకుగా పాల్గొంది. ఐక్యరాజ్యసమితిలో భారతీయ ప్రతినిధి బృందం డిక్లరేషన్ ముసాయిదా రూపకల్పనలో ముఖ్యమైన సహకారాన్ని అందించింది. ప్రత్యేకించి లింగ సమానత్వాన్ని ప్రతిబింబించే ఆవశ్యకతను ఎత్తిచూపింది.

భారతదేశం ఆరు ప్రధాన మానవ హక్కుల ఒడంబడికలపై సంతకం చేసింది. అలాగే పిల్లల హక్కుల ఒప్పందానికి సంబంధించిన రెండు ఐచ్ఛిక ప్రోటోకాల్‌లపై కూడా సంతకం చేసింది. ప్రారంభమైనప్పటి నుండి, భారతీయ రాజ్యాంగం సార్వత్రిక ప్రకటనలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, విధాన నిర్దేశక సూత్రాలు మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలోని దాదాపు మొత్తం రంగాన్ని కవర్ చేసింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993 కింద జాతీయ మానవ హక్కుల కమీషన్ (ఎన్ ఎచ్ ఆర్ సి)ని అక్టోబర్ 12, 1993న ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ దేశంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం ఒక స్వతంత్ర, స్వయంప్రతిపత్త సంస్థగా పనిచేస్తోంది.

వివిధ హక్కుల స్వభావం, హోదా తప్పనిసరిగా అవి ఉత్పన్నమయ్యే స్వభావం, విధి విధానాలకు అనుగుణంగా ఉంటాయి అనే ప్రాథమిక సత్యాన్ని ప్రాచీన హిందూ పరిజ్ఞానం గ్రహించింది. విధి కేంద్రీకృత హక్కుల లక్ష్యాన్ని సాధించడానికి, ఋణ, యజ్ఞం, పురుషార్థ అనే భావన అభివృద్ధి చేయబడింది. ఋగ్వేదం ప్రపంచంలోని మానవ హక్కుల పురాతన వనరులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎవరూ గొప్పవారు కాదు, తక్కువ వారు కాదు, అందరూ సోదరులు, అందరూ అందరి ప్రయోజనాల కోసం కృషి చేయాలి, సమిష్టిగా అభివృద్ధి చెందాలని ఋగ్వేదం చెబుతోంది. అందర్ని సంతోషంగా ఉండనివ్వండి, అందరూ రోగాల నుండి విముక్తి పొందండి, అందర్ని శుభకార్యాలను చూడనివ్వండి, ఎవరూ దు:ఖంతో బాధపడకండి అని బృహదారణ్యక ఉపనిషత్ గ్రంథాలలో ఉంది. ప్రజల ఆనందంలో రాజు ఆనందం ఉంది, వారి సంక్షేమమే అతని సంక్షేమం, తన ప్రజలకు నచ్చినది మాత్రమే రాజుకు మంచిదని కౌటిల్యుడి అర్థశాస్త్రం చెబుతోంది. ప్రాచీన హిందూ గంథ్రాలు మానవ హక్కుల గురించి ఆలోచనల జాడలను అందించడమే కాకుండా, విధులకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చాయి. హిందూ సంప్రదాయంలో మానవ గౌరవం జీవించే హక్కులో అంతర్భాగం. పౌర మరియు చట్టపరమైన హక్కులను మొదట సూత్రీకరించిన మను, ఆర్థిక హక్కులను కూడా జోడించాడు. పురాణాలు మరియు పంచతంత్రాలలోని అనేక కథలు వైదిక సమాజం మానవ హక్కులకు కట్టుబడి ఉందని వెల్లడిస్తున్నాయి. కావున, ప్రాచీన హిందూ తత్వశాస్త్రం అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయశాస్త్రాన్ని అభివృద్ధి చేయడంలో మరియు సుసంపన్నం చేయడంలో సహాయపడుతుంది. ఇది మరింత వాస్తవికమైనది, ఆమోదయోగ్యమైనది మరియు అన్వయించదగినది.