News

కార్మిక చట్టాల అమలును స్వాగతించిన బిఎంఎస్

154views

భారతదేశ శ్రామిక శక్తికి గౌరవం, రక్షణ , ప్రగతిశీల సంక్షేమాన్ని నిర్ధారించడం లక్ష్యంగా దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నాలుగు కార్మిక కోడ్‌లను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని దేశంలో అతిపెద్ద కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్-బిఎంఎస్ హృదయపూర్వకంగా అభినందించింది.

బిఎంఎస్ ప్రతినిధి బృందం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్‌‌సుఖ్ మాండవీయను కలిసి కార్మిక కోడ్‌లకు సంబంధించిన కొన్ని కార్మిక సంబంధిత సమస్యలపై వివరణాత్మక వినతి పత్రాన్ని సమర్పించింది. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, అవసరమైతే పార్లమెంటులో సవరణలతో సహా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బిఎంఎస్ ప్రతినిధి బృందానికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

కార్మిక మంత్రి సానుకూలంగా ప్రతిస్పందించడం పట్ల బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి రవీంద్ర హిమ్టే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు కార్మిక కోడ్‌లు కార్మికరంగంలో ఉద్భవిస్తున్న సమస్యలను పరిష్కరించడానికి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా రూపొందించినట్లు బిఎంఎస్ తెలిపింది. షెడ్యూల్డ్ ఉపాధి, సామాజిక భద్రతా రక్షణకు వంటి అంశాలతో ఆధునిక శ్రామిక శక్తి భవిష్యత్తు సంస్కరణలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయని తెలిపింది.

దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల అమలుకు మద్దతు ఇవ్వడానికి బిఎంఎస్ సిద్దంగా ఉందని పునరుద్ఘాటించింది. కార్మికుల సంక్షేమం కోసం తాము ప్రభుత్వంతో పాటు అందరు వాటాదారులతో కలిసి పనిచేస్తూనే ఉంటామని తెలిపింది.

న్యాయమైన, సమ్మిళితమైన, సాధికారత కలిగిన కార్మిక పర్యావరణ వ్యవస్థ వైపు భారతదేశం చేస్తున్న ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని విశ్వసిస్తున్నట్లు బిఎంఎస్ స్పష్టం చేసింది. కాగా, స్వాతంత్ర్యం తరువాత అది పెద్ద కార్మిక సంస్కరణకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన నాలుగు కార్మిక కోడ్ లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

అవి:
1. వేతనాలకు సంబంధించిన కోడ్ 2019,
2. శ్రామిక యూనియన్‌లు, ఉద్యోగ వివాదాల నియమాల కోడ్ 2020,
3. సాంఘిక భద్రతా ప్రయోజనాలైన ఇన్స్యూరెన్స్, పీఎఫ్, వైద్యానికి సంబంధించిన కోడ్ 2020,
4. పని స్థలంలో భద్రత, ఆరోగ్యం, పని షరతుల నియంత్రణ కోడ్

‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో భాగంగా మారుతున్న పనితీరు, పరిస్థితులకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సంసిద్ధం చేయడమే ఈ సంస్కరణల లక్ష్యమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ చారిత్రక నిర్ణయంతో కార్మిక నిబంధనలు, కార్మికుల సంక్షేమం మెరుగవుతుందని ఆయన చెప్పారు.

మన దేశంలోని చాలా కార్మిక చట్టాలను 1930ల నుంచి 1950ల మధ్య కాలంలో రూపొందించినట్లు చెప్పిన కేంద్ర మంత్రి, ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ, పని విధానం ఇప్పుడున్న దాని కంటే పూర్తి భిన్నంగా ఉండేదని, ఇప్పుడు పరిస్థితులు మారాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే తమ చట్టాలను మార్చుకున్నాయని, మనం మాత్రం కాలం చెల్లిన నిబంధనలతో కొనసాగుతున్నామని ఆయన తెలిపారు.

తాజా సంస్కరణలతో ఆ సమస్య తొలగిపోతుందని కేంద్రమంత్రి ధీమా వ్యక్తం చేశారు. కొత్త లేబర్‌ కోడ్‌లకు సంబంధించిన చట్టానికి 2020లోనే ఆమోదం లభించిందని, కానీ, వివిధ రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేయడంలో ఆలస్యం చేయడంతో అమలు వాయిదా పడుతూ వచ్చిందని చెప్పారు.