
ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో అల్- ఫలా యూనివర్సిటీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విశ్వవిద్యాలయం ఛైర్మన్గా ఉన్న జావెద్ సిద్దిఖీ గురించి తాజాగా మరో కీలక విషయం బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ఆయన కుటుంబానికి సంబంధించిన అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు.
మోవ్ కంటోన్మెంట్ బోర్డులో జావెద్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈక్రమంలో మూడు రోజుల్లో దాన్ని కూల్చివేయాలని నోటీసులు జారీ చేశారు. కంటోన్మెంట్ ఇంజినీర్ హెచ్ఎస్ కలోయా మాట్లాడుతూ.. ‘జావెద్ తండ్రికి సంబంధించిన ఇంటిలో అనధికారికంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేశాం. అయినప్పటికీ.. వాళ్లు వాటిని బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లోగా వాటిని కూల్చివేయాలని ఆదేశిస్తూ తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చాం’ అని తెలిపారు. తమ ఆదేశాలను పట్టించుకోకపోతే కూల్చివేత పనులు తామే చేపడతామన్నారు. నిబంధనల ప్రకారం.. దానికి సంబంధించిన ఖర్చులను వారి నుంచి వసూలు చేస్తామన్నారు.
దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడుకు కీలక సూత్రధారి అయిన డాక్టర్ ఉమర్ నబీ ఈ విశ్వవిద్యాలయంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ను అధికారులు ఛేదించిన క్రమంలోనే ఈ పేలుడు జరిగింది. ఈ ఉగ్ర మాడ్యూల్ గురించిన దర్యాప్తులో.. ఇందులోని వ్యక్తులకు అల్-ఫలా యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ వర్సిటీపై దిల్లీ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో వర్సిటీ ప్రధాన కార్యాలయంతో పాటు మరో 24 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ దాడులు చేసింది. అల్-ఫలా గ్రూప్ ఛైర్మన్ జావెద్ను అరెస్టు చేసింది. తప్పుడు అక్రిడిటేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి మొత్తం రూ.415 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది.





