News

జైషే మహిళా విభాగంలో డాక్టర్‌ షాహిన్‌..

217views

ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్‌ షాహిన్‌ వెనుక ఏకంగా జైషే మహమ్మద్‌ నెట్‌వర్క్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థ మహిళా విభాగంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేసిన అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.

భారత్‌ ఇటీవల నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఆ ఉగ్ర సంస్థకు చెందిన ప్రధాన కేంద్రం కూడా ధ్వంసమైంది. ఈ క్రమంలో జైషే మహిళా బ్రిగేడ్‌ల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ జమాత్‌ ఉల్‌ మొమినాత్‌ విభాగానికి మసూద్‌ సోదరి సాదియా అజార్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగంలో డా.షాహిన్‌కు కీలక బాధ్యతలు అందించినట్లు తెలుస్తోంది. భారత్‌లో మహిళా విభాగాలు స్థాపించి, వారి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

డా. షాహిన్‌ షాహిద్ లఖ్‌నవూలోని లాల్‌బాగ్‌ నివాసి. ఫరీదాబాద్‌లోని మాడ్యూల్‌పై ఆపరేషన్‌ నేపథ్యంలో ముగ్గురు వైద్యులు అదీల్‌ అహ్మద్, ముజమ్మిల్‌ షకీల్, షాహిన్‌లను అధికారులు అరెస్టు చేశారు. ముజమ్మిల్‌తో షాహిన్‌కు దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయుధాలను నిల్వ చేసేందుకు అనుమానితులు ఉపయోగించిన కారు మహిళా డాక్టర్‌ పేరు మీదే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముజమ్మిల్‌ విచారణ నేపథ్యంలో ఈ మహిళా డాక్టర్‌ విషయం తెలియగా.. అధికారులు ఆమెను కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో విచారణ కోసం ఆమెను శ్రీనగర్‌కు తరలించారు.

మరో మహిళా డాక్టర్‌ అరెస్టు..
ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలున్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లో మరో మహిళా డాక్టర్‌ను అధికారులు అరెస్టు చేశారు. సహరన్‌పుర్‌కు చెందిన డాక్టర్‌ పర్వేజ్‌ అన్సారీ ఇంటిపై దాడులు చేసిన పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఫరీదాబాద్‌ ఉగ్రకుట్రలోని డాక్టర్‌ ఆదిల్‌తో ఈమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.