News

‘కార్తిక మాసం జ్యోతిర్లింగ దర్శనం’ పేరుతో ప్రత్యేక రైలు

162views

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో విజయవాడ డివిజన్‌లోని రేణిగుంట స్టేషన్‌ నుంచి ‘కార్తీకమాసం జ్యోతిర్లింగ దర్శనం’ పేరుతో భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్‌ ఎం.రాజా తెలిపారు. ఈ నెల 26 నుంచి నవంబర్‌ 4వరకు జరిగే ఈ యాత్రలో ద్వారకలోని ద్వారకాదీష్‌ ఆలయం, నాగేశ్వర్‌ దేవాలయం, ద్వారకా, సోమనాథ్‌లోని సోమనాథ్‌ ఆలయం, అహ్మదాబాద్‌లోని సబర్మతి అశ్రమం, మోథేరా సూర్యదేవాలయం, రాణిక వాప్‌, స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ (ఏక్తా నగర్‌) సందర్శన ఉంటుందన్నారు. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ స్టేషన్‌లలో బోర్డింగ్‌/డీబోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో ఆన్‌బోర్డు/ఆఫ్‌బోర్డులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టిఫిన్‌, భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణ సదుపాయం, రాత్రుళ్లు హోటల్స్‌లో బస తదితర ఏర్పాట్లతో పాటు కోచ్‌లలో సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత ఏర్పాట్లు, టూర్‌ ఎస్కార్ట్‌లు అందుబాటులో ఉంటారని తెలిపారు.

ప్యాకేజీ ధరలు…

ఈ యాత్రలో ఎకానమి (స్లీపర్‌ క్లాస్‌) పెద్దలకు ఒక్కొక్కరికి రూ. 18,400, పిల్లలకు రూ. 17,300, స్టాండర్డ్‌ (3 ఏసీ)లో పెద్దలకు రూ. 30,200, పిల్లలకు రూ. 28,900, కంఫర్ట్‌ (2 ఏసీ) పెద్దలకు రూ 39,000, పిల్లలకు రూ. 38,300 టికెట్‌ ధర నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు ఆర్‌ఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా 9281495848, 9281030714 ఫోన్‌ నంబర్‌ల ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సిందిగా సూచించారు.