
ఛత్తీస్గఢ్లో పెద్దఎత్తున నక్సలైట్లు ఆయుధాలు విడిచి లొంగిపోయిన క్రమంలో గరియాబంద్ జిల్లాలోని ఉదంతి ఏరియా కమిటీ కూడా ఆ బాట పట్టింది. ఇందుకు సంబంధించి తాజాగా ఒక లేఖ విడుదల చేసింది. ఆయుధాలు విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ విషయాన్ని గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఛేఖా ధ్రువీకరించారు. వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉదంతి కమిటి రాసిన లేఖను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకోవడం సానుకూల పరిణామమని, గరియాబంద్ ప్రాంతంలో చురుకుగా ఉన్న అనేక మంది నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని మీడియా ద్వారా నిరంతరం విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నామని ఎస్పీ తెలిపారు.
గోబ్రా, సీతానది, శక్తి సారన్గఢ్, రాయ్గఢ్ ప్రాంతాల్లో చురుకుగా ఉన్న మావోయిస్టులు వీలైనంత త్వరగా లొంగిపావాలని ఆయన కోరారు. ఏమాత్రం సంకోచం లేకుండా తనను నేరుగా సంప్రదించవచ్చని, ముందుగా లొంగిపోయే నక్సలైట్ల బాధ్యత పూర్తిగా తాము తీసుకుంటామని నిఖిల్ రఛేఖా అన్నారు.