News

ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత సైనిక దళాలదే పైచేయి

37views

ప్రపంచ శాంతిని పరిరక్షించడంలో భారత సైనిక దళాలు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. UN తాత్కాలిక భద్రతా దళం (UNISFA) ప్రపంచంలోని కల్లోలిత ప్రాంతాల్లో శాంతి స్థాపనకు సైన్యాన్ని మోహరించి శాంతిభద్రతల్ని కాపాడుతుంది. ఇందుకోసం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సైన్యాన్ని సమీకరించి ఆయా ప్రాంతాల్లో మోహరిస్తుంది. ఇలా ఐక్యరాజ్యసమితి పంపించే దళాల్లో ఎక్కువ మంది భారత సైనికులే కావడం విశేషం.

ఇలా ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి తాత్కాలిక భద్రతా దళాల్లో భారతదేశానికి చెందిన సైనిక పరిశీలకులు, సిబ్బంది, అధికారులు ఉన్నారు. ఇది ప్రపంచ శాంతిభద్రతలకు భారతదేశపు అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 1950ల నుంచి భారత్ ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా మిషన్లకు 2,90,000 మందితో కూడిన శాంతి పరిరక్షక దళాలను పంపింది.

రెండవ సూడాన్ అంతర్యుద్ధాన్ని ముగింపచేయడంలోనూ భారత సైనికులు ఎంతో కీలకపాత్ర పోషించారని ‘అబై’ కోసం ఏర్పాటు చేసిన UN తాత్కాలిక భద్రతా దళం మేజర్ జనరల్ రాబర్ట్ యా ఆఫ్రామ్ తెలిపారు. ఇది ఐక్యరాష్ట్ర సమితి (UN) ఆధ్వర్యంలో సూడాన్ – దక్షిణ సూడాన్ మధ్య వివాదాస్పదమైన అబై ప్రాంతంలో శాంతి నిర్వహణ కోసం 2011లో ఏర్పాటు చేసిన ఒక శాంతి స్థాపన బలగం.

ఇలా భారత్ UN శాంతి పరిరక్షక ప్రయత్నాలకు ప్రపంచంలోనే అతిపెద్ద సహకారిగా నిలిచింది. ప్రస్తుతం, ప్రపంచ వ్యాప్తంగా శాంతిభద్రతల్ని కాపాడటానికి ఏర్పాటు చేసిన 11 క్రియాశీల మిషన్లలో తొమ్మిదింటిలో 5,000 మందికి పైగా భారతీయ సైనికులు పనిచేస్తున్నారు. ఈ ప్రయత్నంలో దాదాపు 180 మంది భారతీయ శాంతి పరిరక్షకులు వీర మరణం పొందారు.