
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు తమకు అవసరమైన పరికరాలను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులకు సాయం చేసిన ఒక ఓవర్ గ్రౌండ్ వర్కర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు, జమ్ము కశ్మీర్లోని కుల్గాం జిల్లాకు చెందిన మహ్మద్ యూసఫ్ కటారి (26)గా గుర్తించారు. అతడిని విచారించగా కీలక విషయం వెల్లడైంది.
ఈ ఏడాది ఏప్రిల్ 22న మధ్యాహ్నం సమయంలో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాస్ వ్యాలీలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టులను ఈ ఏడాది జులై 29న ‘ఆపరేషన్ మహాదేవ్’లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ ఆపరేషన్ సమయంలో ఎన్కౌంటర్ స్థలం నుంచి మూడు మొబైల్ ఛార్జర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తులో జరిగిన టెక్నికల్ వెరిఫికేషన్లో వీటిల్లో ఒక ఛార్జర్ ఓ ఫోన్తో పాటు వచ్చినట్లు గుర్తించారు. ఉగ్రవాదులు తమ హ్యాండ్లర్లతో, కింది స్థాయి కార్యకర్తలతో మాట్లాడేందుకు మొబైల్ ఫోన్ ఛార్జర్లను ఓ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. విచారణ సందర్భంగా ఆ ఛార్జర్ను ఉగ్రవాదులకు తానే అందజేసినట్లు కటారి అంగీకరించినట్లు సంబంధిత అధికారులు తాజాగా వెల్లడించారు.





