
మహారాష్ట్ర మహావికాస్ అఘాడీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో అసంతృప్తి చిచ్చు మొదలైంది. మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న కారణంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు ఆ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. మరోవైపు ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు సైతం అలకబూనినట్లు సమాచారం. సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం తన మంత్రివర్గాన్ని విస్తరించిన సంగతి తెలిసిందే. కొత్తగా 36 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా భోర్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంగ్రామ్ తోప్టేకి చోటివ్వకపోవడంతో ఆయన అనచరులు పుణెలోని పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంగ్రామ్ తోప్టే మాజీ మంత్రి అనంత్రావ్ తోప్టే కుమారుడు. మరోవైపు పార్టీకి చెందిన పలువురు సైతం మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్, మాజీ ముఖ్యమంత్రి సుశీల్కుమార్ షిండే కుమార్తె, సోలాపూర్ ఎమ్మెల్యే ప్రణితి తదితరులు కినుక వహించినట్లు సమాచారం. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడీ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





