
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్యాన్ (Gaganyaan) అంతరిక్ష ప్రాజెక్టులో ఇస్రో (ISRO) మరో ముందడుగు వేసింది. క్రూ మాడ్యూల్కు సంబంధించిన తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్టు (IADT-01)ను విజయవంతంగా నిర్వహించింది. వాయుసేన, నౌకాదళం, డీఆర్డీవో, కోస్ట్గార్డ్ల సంయుక్త సహకారంతో ఈ పరీక్షలు చేపట్టింది.
ఈ ప్రయోగంలో భాగంగా మాడ్యూల్ నమూనాను హెలికాప్టర్ సాయంతో నింగిలోకి తీసుకెళ్లి.. కిందికి జారవిడిచారు. పారాచూట్ల సాయంతో ఆ మాడ్యూల్ వేగాన్ని తగ్గించుకుంటూ. సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. మానవసహిత అంతరిక్ష ప్రయోగాల సమయంలో వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగి వచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు. మాడ్యూల్ భూవాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం దాని వేగ నియంత్రణ, ల్యాండింగ్ విషయంలో పారాచూట్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. సంక్లిష్టమైన ఈ వ్యవస్థ పనితీరును పరీక్షించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు సమాచారం.
భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో చేపట్టిన గగన్యాన్ మిషన్లో భాగంగా ఇస్రో అనేక పరీక్షలు నిర్వహిస్తోంది. జులైలో సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్(SMPS)కు సంబంధించి రెండు హాట్ టెస్టులను విజయవంతంగా చేపట్టింది. 2027లో తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల వెల్లడించారు.





