News

లవ్ జిహాద్ పై పిటిషన్ ను తిరస్కరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు

233views

మీడియా ‘లవ్ జిహాద్’ అనే పదాన్ని ఉపయోగించకుండా నిరోధించడానికి న్యాయపరమైన జోక్యం కోరుతూ మరూఫ్ అహ్మద్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ విశాల్ మిశ్రా నేతృత్వంలోని మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ తిరస్కరించింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద దాఖలు చేయబడిన ఈ పిటిషన్, ముస్లిం సమాజానికి సంబంధించిన “నకిలీ, తప్పుదారి పట్టించే” వార్తలుగా పిటిషనర్ అభివర్ణించి, వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాలని కోర్టును కోరుతూ ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. ఇటువంటి నివేదికలు మత ఉద్రిక్తతకు దారితీస్తాయని, ముస్లింలను ప్రతికూల వ్యక్తులుగా చిత్రీకరిస్తాయనీ, ముఖ్యంగా లవ్ జిహాదీలకు సంబంధించిన కేసులలో ఆయన ఆరోపిస్తూ పిటిషన్ వేశారు..మీడియాలో ‘లవ్ జిహాద్’ అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగించడం వాస్తవంగా తప్పు మాత్రమే కాకుండా తీవ్ర అవమానకరమైనదని, ముస్లిం పురుషులను అవమానించడానికి సమాజం మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకు దోహదపడుతుందని ఈసందర్భంగా ఖాన్ వాదించారు. ఈ పదాన్ని వాడి మీడియా తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తుందని , మతపరమైన సామరస్యాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన ఆరోపించారు.

అయితే, జస్టిస్ విశాల్ మిశ్రా ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి నిరాకరించారు. పిటిషన్ లోని కంటెంట్ ప్రజాప్రయోజన వ్యాజ్యంగా ఉందని గమనించారు. అటువంటి సందర్భాలలో, ముఖ్యంగా వ్యక్తిగత ఫిర్యాదులను ప్రజా ప్రయోజన సమస్యలుగా కప్పిపుచ్చినప్పుడు, మాండమస్ రిట్ జారీ చేయలేమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

“రిట్ పిటిషన్‌లో క్లెయిమ్ చేయబడిన అంశం, ఫిర్యాదులో చేసిన వాదనలతో కలిపి, ఈ పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా ఉంది, దీనికి మాండమస్ జారీ చేయలేమని స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరిస్థితులలో, ఈ కోర్టు రిట్ పిటిషన్‌ను స్వీకరించలేదు” అని కోర్టు తీర్పు చెప్పింది.

బదులుగా, CrPC సెక్షన్ 156(3) లేదా BNSS సెక్షన్ 175 కింద మేజిస్ట్రేట్‌ను సంప్రదించడం లేదా CrPC సెక్షన్ 200 లేదా BNSS సెక్షన్ 223 కింద ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయడం వంటి ప్రత్యామ్నాయ చట్టపరమైన పరిష్కారాలను అనుసరించాలని ధర్మాసనం పిటిషనర్‌ను ఆదేశించింది.

ముస్లిం పురుషులు హిందూ మహిళలను వివాహం ద్వారా మతమార్పిడికి ప్రలోభపెడుతున్నారని ఆరోపించబడిన కేసులను వివరించడానికి మీడియా ఉపయోగించే ‘లవ్ జిహాద్’ అనే పదంపై దేశవ్యాప్తంగా తీవ్రమైన రాజకీయ దుమారం రేగుతున్న సందర్భంలో కోర్టు తీర్పు ఆలోచింపచేసేలా ఉందని పలువురు అంటున్నారు.