
ఆదివాసీ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు.
ఆపై 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కార్యక్రమం ఉంటుంది. 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు వెల్లడించారు. ఈ జాతరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజారులు కోరుతున్నారు. కాగా.. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం జాతర జరుగుతుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తుంటారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ.




