News

అయోధ్యను సందర్శించిన ఎలాన్‌ మస్క్‌ తండ్రి

219views

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ తండ్రి ఎరోల్‌ మస్క్‌ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరానికి వెళ్లారు. అక్కడ నూతనంగా నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. భారతదేశం ఓ అద్భుతమైన ప్రదేశం అని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు ప్రేమ, దయ కలిగిన వ్యక్తులు అని అన్నారు.

కాగా, దక్షిణాఫ్రికాకు చెందిన ఎరోల్‌ మస్క్‌.. తన స్కూల్‌ ఫ్రెండ్‌ అయిన మాయే మస్క్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత కొన్నేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. మాయే మస్క్‌ తన ముగ్గురు పిల్లల్ని ఒంటరిగానే పెంచింది. సింగిల్‌ మదర్‌గా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఇక ఎలాన్‌ మస్క్‌కు తన తండ్రి ఎరోల్‌ మస్క్‌తో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. తండ్రంటే మస్క్‌కు అస్సలు ఇష్టం ఉండదు. ‘మా నాన్న దుర్మార్గానికి ప్రతిరూపం. ఒక మనిషి ఎంత దారుణానికి ఒడిగట్టగలడో, అంతా తను చేయగలడు’ అని ఓ సందర్భంలో స్వయంగా మస్క్‌ భారంగా వెల్లడించాడు.