
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో పోలీసులపైకి రాళ్లు విసిరే ఘటనలు, అల్లర్లు తగ్గాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు లోక్సభలో అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్రెడ్డి సమాధానమిచ్చారు. ‘పోలీసులపైకి రాళ్లు విసరడం, భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి నవంబరు 15 వరకు మొత్తం 190 కేసులు నమోదయ్యాయి. వీటిలో 765 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. 2019 జనవరి 1 నుంచి ఆగస్టు 4 మధ్య 361 కేసులు నమోదయ్యాయి’ అని పేర్కొన్నారు.
కశ్మీర్ లోయలో అల్లర్ల వెనుక పలు వేర్పాటువాద సంస్థలు, హురియత్ నేతల హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఆయన తెలిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కశ్మీర్ పర్యాటక రంగంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘గత ఆరునెలల్లో జమ్ముకశ్మీర్ను 34,10,219 మంది పర్యాటకులు స్పందించారు. వీరిలో 12,934 మంది విదేశీయులు. ఈ ఆరునెలల్లో పర్యాటక రంగం ద్వారా రూ. 25.12కోట్ల ఆదాయం వచ్చింది’ అని వెల్లడించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





