
మనిషి సంకల్పం ముందు ఏదైనా చిన్నబోవాల్సిందే. అలాంటి ఉదంతాలు ఎన్నో కోకొల్లలుగా జరిగాయి. వాటన్నింటిని తలదన్నేలా అంతకు మించి..అనే అజేయమైన సాహాసానికి తెరతీశాడు ఈ 70 ఏళ్ల వృద్ధుడు. అతడి చేసిన ఘనకార్యం ఏంటో తెలిస్తే.. ఇదేలా సాధ్యం అనే ఆశ్చర్యం కలగకమానదు.
కర్ణాటకలోని కలబురగి (గుల్బర్గా) జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్కు కాలినడకన వచ్చాడు. ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి మరీ కేదార్నాథ్ స్వామిని దర్శించుకున్నారాయన. ఆ వృద్ధ భక్తుడు తన తోటి యాత్రికుల బృందంతో కలబురగి నుంచి ఈ యాత్ర చేసినట్లు తెలిపారు. తాము మార్చి 3న యాత్రని ప్రారంభించి మే 1న కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకున్నామని అన్నారు.
అంటే దాదాపు రెండు నెలల్లో వివిధ మైదానాలు, అడవులు, పర్వత మార్గాల గుండా సుమారు 2,200 కిలోమీటర్ల అసాధారణ యాత్రను చేశారు వారంతా. అంతేగాదు ఆ వృద్ధుడు ఇదంతా మన ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి అని అంటున్నారాయన. దైవం ఆశీస్సులు ఉంటే ఎంత కఠినతరమైన ప్రయాణమైనే చిటికెలో సాధ్యమైపోతుందని ధీమాగా చెబుతున్నాడు ఆ వృద్ధుడు.
అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎంతో మంది నెటిజన్ల మనసును కదిలించింది. ధృడ సంకల్పం, అజేయమైన భక్తి..అనితరసాధ్యమైన ఓర్పుని అందిస్తాయనడానికి ఆ వృద్ధుడే ఉదహారణ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.





